Director Krishna Vamsi: 2024లో ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాలు విడుదల అవ్వగా.. అందులో అన్నింటికంటే సూపర్ హిట్‌ను సాధించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. ఇప్పటికీ చాలావరకు థియేటర్లలో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా ‘హనుమాన్’ సినిమాను కృష్ణవంశీ తెరకక్కించిన ‘శ్రీ ఆంజనేయం’తో పోలుస్తూ ఒక వ్యక్తి ట్వీట్ చేశారు. ఇప్పుడు మాత్రమే కాదు.. ‘హనుమాన్’ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి చాలామంది ప్రేక్షకులు పోలుస్తూ పోస్టులు పెట్టారు. దానిపై ఎట్టకేలకు కృష్ణవంశీ రియాక్ట్ అయ్యారు.


రెండూ ఒకటే కథతో..


హీరో.. హనుమంతుడి భక్తుడు. తనకు ఊరు తప్పా వేరే ప్రపంచం తెలియదు. ఊళ్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నా హీరోకు ఎదిరించే ధైర్యం ఉండదు. అలా ఒకానొక సందర్భంగా ఆ హనుమంతుడే స్వయంగా వచ్చి హీరోకు తన శక్తులను అందిస్తాడు. ఇది ‘హనుమాన్’ కథ. ‘హనుమాన్’ది మాత్రమే కాదు.. ‘శ్రీ ఆంజనేయం’ కథ కూడా ఇదే. నితిన్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రమే ‘శ్రీ ఆంజనేయం’. 2004లో విడుదలయిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని టీవీలకు అతుక్కుపోయి చూసే ప్రేక్షకులు ఉన్నా.. థియేటర్లలో మాత్రం ఎందుకో ఈ మూవీ సక్సెస్ సాధించలేదు. ఇక ‘హనుమాన్’ సక్సెస్ తర్వాత మరోసారి ‘శ్రీ ఆంజనేయం’ ప్రస్తావన వచ్చింది.


రీచ్ అవ్వడంలో సమస్య..


‘‘నాకెందుకో ‘హనుమాన్’ కంటే ‘శ్రీ ఆంజనేయం’ మూవీనే నచ్చింది ఎందుకో తెలియదు. సూపర్ సినిమా శ్రీ ఆంజనేయం. పిచ్చి నా కొడుకులకు అర్థం కాలేదు’’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దానికి కృష్ణవంశీ స్పందించారు. ‘‘ప్రేక్షకులకుది ఎప్పుడూ తప్పు కాదు. వాళ్లకు నచ్చలేదు అంటే ఏదో తప్పు జరిగి ఉంటుంది లేదా రీచ్ అవ్వడంలో సమస్య ఉండుంటుంది. అందుకే ఆడియన్స్‌ను నిందించవద్దు. నేను కొన్ని పోర్షన్స్‌లో తప్పు అయ్యింటాను. థాంక్యూ’’ అని చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు కృష్ణవంశీ. ఈ సీనియర్ దర్శకుడి రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాను తెరకెక్కించిన సినిమా హిట్ అవ్వకపోయినా ఆడియన్స్‌ను ఏం అనొద్దు అంటూ కృష్ణవంశీ బాగా మాట్లాడారని కామెంట్లు పెడుతున్నారు.






ఈరోజుల్లో చాలా పెద్ద విషయం..


జనవరి 12న ‘హనుమాన్’ విడుదల అవ్వగా.. ఇప్పటికీ ఈ సినిమా విడుదలయ్యి 30 రోజులు అయ్యింది. అయినా ఇంకా దాదాపు 300 సెంటర్లలో ఇంకా ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఓటీటీ అనేది వచ్చిన తర్వాత ఇన్నిరోజులు థియేటర్లలో ఒక సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడం చాలా పెద్ద విషయమని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడడానికి థియేటర్లకు వెళుతున్న ఆడియన్స్ కూడా ఉన్నారు. ఈ ఒక్క సినిమాతోనే టైర్ 2 హీరోల జాబితాలోకి చేరిపోయాడు తేజ సజ్జా. దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం తను క్రియేట్ చేయబోతున్న సినిమాటిక్ యూనివర్స్‌ కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. ప్రేక్షకులు కూడా తన సినిమాటిక్ యూనివర్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నారు.


Also Read: కొత్త ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతున్న సమంత - ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటన