విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంత క్రమశిక్షణగా ఉంటారో తెలిసిందే. తాను ఒక్కడే కాదు చుట్టుపక్కల వాళ్లంతా క్రమశిక్షణగా ఉండాలని భావిస్తారు. అలా లేకపోతే ఒక్కోసారి వాళ్లపై సీరియస్ అవుతుంటారు. అలాంటి సందర్భాలు ఇప్పటికే చాలా జరిగాయి. అయితే తాజాగా మరోసారి మోహన్ బాబు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. బుధవారం (సెప్టెంబర్ 20) ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మోహన్ బాబు సైతం సందడి చేశారు. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై, ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచి విష్ణు తదితరులు ఈ వేడుకలో కనిపించారు. అఖిల్, సుశాంత్, నాగచైతన్య, సుమంత్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అఖిల్ రామ్ చరణ్ ను దగ్గరుండి మరీ తీసుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో మోహన్ బాబు సీనియర్ నటి జయసుధ పై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






ఏఎన్ఆర్ గురించి అతిధులు మాట్లాడుతున్న సమయంలో జయసుధ ఫోన్ చూశారు. దీంతో మోహన్ బాబు జయసుధ పై సీరియస్ అయ్యారు. అంతేకాదు కోపంతో ఆ ఫోన్ ను లాక్కుందామని ప్రయత్నించారు. ఆ సమయంలో జయసుధ నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 'ఏఎన్ఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఫోన్ చూడటం కరెక్ట్ కాదు కదా. మోహన్ బాబు చేసింది కరెక్టే' అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మోహన్ బాబు ఈ కార్యక్రమంలో ఏఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


" ఏఎన్ఆర్ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయచ్చు. తిరుపతిలో చదువుకునే రోజుల్లో ఏఎన్ఆర్ గారి సినిమాల కోసం చుక్కలు చించుకునే వాళ్ళం. మళ్లీ ఆ చొక్కాలు కుట్టించుకునేందుకు డబ్బులు కూడా ఉండేవి కాదు. అలాంటి ఏఎన్నార్ గారితో నేను పని చేశాను. ఎస్వీ రంగారావు, ఏఎన్ఆర్ నటించిన మరుపురాని మనిషికి అసోసియేట్ గా పనిచేశాను. అక్కినేని నాగేశ్వరరావు  సొంత బ్యానర్ లో ఎన్నో సినిమాల్లో నటించాను. అన్నపూర్ణమ్మ గారైతే నాతో ఎంతో ఆప్యాయతతో మాట్లాడేవారు. ఫలానా చిత్రంలో బాగా నటించావు అని అన్నపూర్ణమ్మ గారు అంటే.. వాడికి అసలే పొగరు. నువ్వు అలా పొగిడితే వాడు ఆగుతాడా? అని ఏఎన్ఆర్ అనేవారు. ఓ రోజు నేను సెట్ కు ఆలస్యంగా వెళ్లాను. అప్పుడు ఓ విషయం చెప్పాను. 'నాకు ఓ కోరిక ఉంది సార్.. ప్రతిసారి మీరు వస్తే మేము నిలబడటమేనా? నేను వచ్చినప్పుడు మీరు లేచి నిలబడాలని కోరుకుంటున్నా' అని అన్నాను. నా కోరిక విని ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాత రోజు సెట్ కి వెళ్తే దాసరి, ఏఎన్ఆర్ ఇద్దరూ నా కోరిక తీర్చేందుకు లేచి నిలబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనతో ఎన్నో సరదా సంఘటనలు, అనుభూతులు ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఉండడం చాలా సంతోషం" అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.


Also Read : చిరు సరసన విశ్వసుందరి - మరి అనుష్క సంగతేంటి?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial