Ram Charan Shbita Dhuliapala Advertisement : ఒకప్పుడు ప్రేక్షకుల్లో ఒక హీరో, హీరోయిన్ జంటకు క్రేజ్ లభిస్తే.. అదే జంటను మళ్లీ మళ్లీ కలిసి నటించేలా చేసేవారు మేకర్స్. కానీ గత కొన్నేళ్లలో ఈ ప్లానింగ్ మారిపోయింది. ఎక్కువగా ఫ్రెష్ పెయిర్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అలా తాజాగా రామ్ చరణ్, శోభితా ధూళిపాళను స్క్రీన్‌పై పెయిర్‌గా చూడాలని ఆడియన్స్‌లో కోరిక మొదలయ్యింది. దానికి కారణం ఒక యాడ్. వీరిద్దరు కలిసి 1 నిమిషం నిడివి ఉన్న యాడ్‌లో కనిపించారు. దీంతో పెయిర్ చాలా క్యూట్‌గా ఉందని, కలిసి సినిమాలో కనిపించాలని నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఫ్యాన్స్ ఫిదా..


రామ్ చరణ్, శోభితా కలిసి నటించిన యాడ్‌లో ఇద్దరూ భార్యభర్తలుగా కనిపించారు. దీంతో ఒక్కసారిగా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది. 1 నిమిషంలోనే ఈ పెయిర్ చూడడానికి ఇంత బాగుంటే.. ఒకవేళ ఒక సినిమాలో కలిసి నటిస్తే.. ఇంకెంత బాగుంటుందో అని ఊహించుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఒక క్లాత్ బ్రాండ్ కోసం రామ్ చరణ్, శోభితా కలిసి యాడ్‌లో నటించారు. ఇందులో పెళ్లికూతురు గెటప్‌లో శోభితా ఎదురుచూస్తూ ఉండగా.. పెళ్లికొడుకు గెటప్‌లో రామ్ చరణ్ మండపానికి ఆలస్యంగా వస్తాడు. దీంతో శోభితా అలక చూపిస్తుంది. దానికి రామ్ చరణ్ క్యూట్‌గా బ్రతిమిలాడుకుంటాడు. ఇదంతా చూసి.. ప్రేక్షకులు ఈ యాడ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.






తెలుగులో గుర్తింపు లేదు


శోభితా ధూళిపాళ తెలుగమ్మాయే అయినా తను తెలుగులో చేసింది రెండు సినిమాలే. ఆ రెండిటిలో కూడా అడవి శేషే హీరో. తన నటనకు ఇంప్రెస్ అయిన అడవి శేష్.. ‘గూఢచారి’ తర్వాత మరోసారి ‘మేజర్’లో తనకు అవకాశం ఇచ్చాడు. ఈ రెండు కాకుండా శోభితాకు మరే ఇతర అవకాశాలు కూడా రాలేదు. ఇప్పటికీ కూడా తన చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. ప్రస్తుతం తను హిందీలోనే పలు సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడిపేస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లలో నటించడానికి మేకర్స్‌కు శోభితానే ఫస్ట్ ఛాయిస్ అయిపోయింది. చివరిగా ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ సిరీస్‌లో హీరోయిన్‌గా కనిపించింది శోభితా. ఇక ప్రస్తుతం ‘మంకీ మ్యాన్’ అనే చిత్రంలో హాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతోంది. ఇలాంటి టాలెంటెడ్ అమ్మాయికి రామ్ చరణ్‌లాంటి గ్లోబల్ స్టార్‌తో సినిమా అవకాశం వస్తే టాలీవుడ్‌లో కూడా తనకు గుర్తింపు లభిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి తెలియదు


ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రం చేస్తున్నాడు. కాకపోతే ఈ మూవీ మొదలయినప్పటి నుంచి ఎన్నో బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా ఫ్యాన్స్‌‌కు క్లారిటీ లేదు. మేకర్స్ కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఇక కూతురు పుట్టిన తర్వాత అప్పుడప్పుడు ఫ్యామిలీ మ్యాన్‌గా ఫోటోగ్రాఫర్లకు కనిపిస్తున్నాడు ఈ గ్లోబల్ స్టార్. అలా అప్పుడప్పుడు తన ఫ్యాన్స్‌కు తనను చూసే అవకాశం లభిస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ ద్వారా కియారా అద్వానీతో మరోసారి జోడీకడుతున్నాడు రామ్ చరణ్.


Also Read: ఇక నా వయస్సుకు తగిన మూవీస్ చేస్తా, నెక్ట్స్ మూవీపై షారుఖ్ క్రేజీ అప్డేట్