బాలీవుడ్ నటి ఆలియా, రణబీర్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు దర్శక నిర్మాత కరణ్ జోహార్. వారం వ్యవధిలోనే రెండుసార్లు ఆలియాకు పెళ్లి జరిగిందంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.


ప్రేమ.. ఆపై పెళ్లి..
పెళ్లి చేసుకుంటే హీరోయిన్ల కెరీర్ ఎండ్ అయిపోయినట్టే అన్నది ఒకప్పటి మాట. ఈరోజుల్లో హీరోయిన్లు పెళ్లి చేసుకొని కూడా సినీ పరిశ్రమలో తమ సత్తా ఏంటో చాటుకుంటున్నారు. ఆ లిస్ట్‌లోకి టాప్ స్టార్ ఆలియా భట్ కూడా ఒకరు. ఎవరూ ఊహించని విధంగా రణబీర్‌ను తాను ప్రేమిస్తున్నానని ఓపెన్‌గా అనౌన్స్ చేసింది ఆలియా. రణబీర్ అంటే తనకు చిన్నప్పటి నుంచి క్రష్ అని కూడా తెలిపింది. కానీ వారిద్దరి ప్రేమ.. పెళ్లి వరకు వెళుతుంది అని ప్రేక్షకులు ఊహించలేదు. పీకల్లోతు ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, తమ మ్యారేజ్ గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక పెళ్లి అయిన వెంటనే ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు.


పెళ్లి తర్వాత రణబీర్ ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. కానీ ఆలియా మాత్రం ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలాకాలం తర్వాత కరణ్ జోహార్.. దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది ఈ చిత్రం. రణవీర్ సింగ్, ఆలియా భట్.. ఇప్పటికే ‘గల్లీ బాయ్’ అనే చిత్రంలో కలిసి నటించారు. అందులో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’కి కూడా అంతకంటే ఎక్కువ మార్కులే పడుతున్నాయి. కొన్ని సీన్లలో వీరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.


మూడు రోజుల వ్యవధిలోనే..
‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమాలో ఆలియా, రణవీర్‌కు జరిగే పెళ్లి సీన్ చాలా గ్రాండ్‌గా తెరకెక్కింది. ఈ సీన్‌ను చూసి ఆలియా రియల్ లైఫ్ పెళ్లిని చూసినట్టే ఉందని ప్రేక్షకులు అనుకున్నారు. అయితే ఈ సీన్ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు కరణ్ జోహార్. ఆలియా, రణబీర్‌లకు పెళ్లి జరిగిన మూడు రోజులకే ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లోని పెళ్లి సీన్‌ను షూట్ చేశామని చెప్పుకొచ్చాడు. ఆ సీన్‌లో ఉండే మెహందీ కూడా ఆలియా రియల్ లైఫ్ మ్యారేజ్‌కు సంబంధించిందే అని తెలిపాడు. అంటే వారం రోజుల వ్యవధిలోనే ఆలియాకు రెండుసార్లు పెళ్లి జరిగిందని, ఒకటి రీల్ లైఫ్, ఒకటి రియల్ లైఫ్ అని కరణ్ జోహార్ అన్నాడు. ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’కి అందుతున్న ఆదరణ చూస్తుంటే.. ఈ వీకెండ్‌లో మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అవ్వడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.


Also Read: కథానాయికగా మరో బాలనటి - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యానీ 'తికమక తాండ'


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial