బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమా అంటే ప్రాణం పెట్టి పని చేసే వాళ్ళల్లో ఒకరు హీరో అక్షయ్ కుమార్. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు సినిమా కోసం ఎంతైనా కష్ట పడతాడు. సినిమా కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తాడు. పెద్ద హీరోలు అనగానే స్టంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్టర్స్ దాదాపుగా  ఎవరినైనా డూప్ ని పెట్టి సీన్ తీసే ప్రయత్నం చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ ఆ అవకాశం ఉన్నా కూడా అక్షయ్ మాత్రం ఎప్పుడూ సొంతంగా చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అలాంటి అక్షయ్ షూటింగ్ లో గాయడినట్టు స్వయానా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 


అక్షయ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'బడేమియా చోటేమియా'. ఈ మూవీ షూటింగ్ స్కాట్లాండ్ లో జరుగుతుంది. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అక్షయ్ స్కాట్లాండ్ వెళ్ళారు. అక్కడ షూటింగ్‌లో టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి స్టంట్స్ చేస్తుండగా అక్షయ్‌ మోకాలికి గాయమైంది. హెలికాప్టర్ పై స్టంట్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం గ్రహించిన మూవీ టీమ్ వెంటనే స్పందించి.. వైద్యులను సంప్రదించారు. అక్షయ్ పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు.. కొంత కాలం పాటు ఎలాంటి స్టంట్స్ చేయకూడదని చెప్పారు. 


అక్షయ్ మోకాలికి గాయం కారణంగా ప్రస్తుతానికైతే.. మూవీ షూటింగ్ కి అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. అయితే అక్షయ్ కొన్ని రోజుల రెస్ట్ తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే మిగతా యాక్షన్ సీన్స్ తీసే అవకాశం ఉన్నట్టు సినీ వర్గాల టాక్. అయితే ఆ సీన్స్ కూడా అక్షయ్ తో తీయిస్తారా.. లేదంటే అతని ప్లేస్ లో డూప్ ను పెట్టి తీస్తారా అన్న విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అక్షయ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 


ఇక శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'బడేమియా చోటేమియా' చిత్రంలో ఇద్దరు యాక్షన్ హీరోలు నటిస్తున్నారు. అందులో ఒకరు అక్షయ్ కుమార్ కాగా.. మరొకరు టైగర్ ష్రాఫ్. ఇద్దరికీ భారీ ఫాలోయింగ్ ఉండడంతో దర్శక, నిర్మాతలు కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్, అలయ, మనూషీ చిల్లర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీలో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ చేయబోతుండడంతో పలు భాషల అభిమానులు కూడా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సూరారైపోట్రుకు హిందీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుందని చిత్ర నిర్వాహకులు రీసెంట్ గా అనౌన్స్ చేశారు.


కెనడా ప్రవాస భారతీయుడైన అక్షయ్ కుమార్ ఇప్పటి వరకు హిందీ చిత్రసీమలో సుమారు 100కుపైగా చిత్రాల్లో నటించి, స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. 90వ దశకంలో ఎక్కువగా యాక్షన్ చిత్రాలతో అలరించిన అక్షయ్ కుమార్.. ఆ తర్వాత కామెడీ మూవీస్ తోనూ అందరినీ అలరించారు. 


కొన్ని సార్లు ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం అంతంత మాత్రం గానే ఉంటుంది. అలాగే గతేడాది విడుదలైన అక్షయ్ కుమార్ చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అంతే కాదు ఈ ఏడాది విడుదలైన సెల్ఫీ సినిమా సైతం డిజాస్టర్ టాక్ లిస్ట్ లో పడిపోయింది. ఇక ఆ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై తన టాలెంట్ ను చూపించడానికి సిద్ధమైన అక్షయ్ కి .. ఈ సమయంలో ప్రమాదం జరగడంపై ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్షయ్ కుమార్ క్లోజప్స్ మాత్రమే తీసుకుని షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం అక్షయ్ స్కాట్లాండ్ లోనే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అక్షయ్ విశ్రాంతి తీసుకుంటున్నందున అతను లేని సీన్స్ షూట్స్ చేస్తున్నారని టాక్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణలో ఇంతకుముందు మేకప్ ఆర్టిస్ట్ చిరుత దాడికి గురవ్వడం గమనార్హం. అంతలోనే ఇప్పుడు అక్షయ్ కి ప్రమాదం జరగడంతో మూవీ టీమ్ కాస్త అప్ సెట్ అయింది. ఏదేమైనా అక్షయ్ త్వరగా కోలుకుని, మునుపటిలా తిరుగుతాడని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


Also Read 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా