Boyapati Sreenu Gives Update On Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబోలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ వంటి సినిమాలొచ్చాయి. ఇవి ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2021లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాలయ్యను రూ.100 కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమా కూడా ఇదే. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ఉంటుందని మూవీ టీం గతంలోనే ప్రకటించారు. 'అఖండ' సీక్వెల్ కోసం బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బోయపాటి శ్రీను సీక్వెల్ పై క్లారిటీ ఇస్తూ సీక్వెల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో కూడా వివరించారు.


ఎన్నికల తర్వాతే 'అఖండ' సీక్వెల్


బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మొదలవడంతో షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ పూర్తయ్యాకే మళ్లీ బాలయ్య షూటింగ్లో పాల్గొంటారు. బాబీతో మూవీ పూర్తవ్వగానే వెంటనే అఖండ సీక్వెల్ ఉండబోతుందని తాజా సమాచారం. ఇదే విషయాన్ని దర్శకుడు బోయపాటి స్వయంగా మీడియా వేదికగా చెప్పారు. కోకాపేటలో నిర్మాత సురేష్ బాబు నిర్మించిన శివకేశవ మహా సన్నిధానం ఆలయం ప్రారంభోత్సవానికి వచ్చిన బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది. ఎలక్షన్స్ ఉండడంతోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ని హోల్డ్ లో పెట్టాం. ఎన్నికలయ్యాక 'అఖండ 2' సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది" అని అన్నారు.


'అఖండ 2'లో సమాజానికి కావాల్సిన కాన్సెప్ట్ ఉంటుంది


"మీరు అఖండ చూశారు. అందులో పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ.. ఈ మూడింటి కాన్సెప్ట్ ని టచ్ చేశాం. ఈసారి 'అఖండ 2' లో కూడా సొసైటీకి కావలసిన మంచి కాన్సెప్ట్ ఉండబోతుంది. దాని మీదే కాన్సెంట్రేట్ చేసి ముందుకెళ్తున్నాం. ఇక దైవత్వం అంటారా! అది భారతీయుల నరనరాల్లో ఇంకిపోయి ఉంది. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు" అని చెప్పుకొచ్చాడు. బోయపాటి చెప్పిందాన్ని బట్టి 'అఖండ 2'లో దైవత్వంతో పాటు ఓ సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. కాగా బోయపాటి గత ఏడాది 'స్కంద' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'అఖండ 2' స్క్రిప్ట్ విషయంలో బోయపాటి ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Also Read : కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?