Akash Puri: చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ.. 'ఆంధ్రా పోరీ' అనే సినిమాతో హీరోగా మారాడు. అయితే కథానాయకుడిగా ఇప్పటి వరకూ ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయారు. అయితే హీరోగా తనని తాను నిరూపించుకున్న తర్వాతే తన తండ్రి దర్శకత్వంలో సినిమా చేస్తానని ఆకాష్ అంటున్నాడు. ఓ మెన్స్ వేర్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఎంపికైన సందర్భంగా హైదరాబాద్ లో ఆకాష్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


పూరీ ఆకాష్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా స్క్రిప్టులు వింటున్నానని, రెండు మూడు కథలు ఓకే చేశానని చెప్పారు. వాటిల్లో ఒకటి మంచి లవ్ స్టోరీ అయితే, మరొకటి యాక్షన్ మూవీ అని తెలిపారు. త్వరలోనే ఆ సినిమాల వివరాలను ప్రకటిస్తారని అన్నారు. ఏదో ఒకటి చేసే బదులు, ఏదైనా గట్టిగా చేద్దామనే ఆలోచనతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అందుకే గ్యాప్‌ వచ్చిందని చెప్పారు.


ఏదైనా కథ నచ్చితే ముందుగా తన తండ్రికి చెప్తానని, ఆయన కూడా తన కోసం కథలు వింటున్నారని తెలిపారు ఆకాష్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మూవీ ఎప్పుడు వుంటుందని ఆకాష్.. దానికి ఇంకా టైం ఉందన్నారు. "ప్రస్తుతానికి డాడీ దర్శకత్వంలో సినిమా చేయకూడదని నేనే అనుకుంటున్నాను. పూరీ జగన్నాథ్ కొడుకు అని కాకుండా.. ఒక యాక్టర్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత, అన్నీ సెట్ అయినప్పుడు మేమిద్దరం కలిసి ఓ పెద్ద సినిమా చేస్తాం" అని అన్నారు. 


చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా, మాస్ ఆడియెన్స్ నుంచి క్లాస్ ఆడియెన్స్ దాకా అందరూ ఎంజాయ్ చేసే యూనివర్సల్ యాక్సెప్ట్ ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నానని ఆకాష్ చెప్పారు. తన ఫ్రెండ్ తేజ సజ్జా ‘హనుమాన్‌’ తో అంత పెద్ద హిట్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ సక్సెస్ కోసం అతడు ఎంతగా స్ట్రగుల్ అయ్యాడో ఎంతలా కష్టపడతాడో తనకు తెలుసని అన్నారు. తాను కూడా అంతే కష్టపడి భవిష్యత్ లో మంచి సబ్జెక్ట్స్ తో వస్తానని చెప్పారు.


రామ్‌ హీరోగా తన తండ్రి తెరకెక్కిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆకాష్ తెలిపారు. షూటింగ్ చాలా బాగా జరుగుతోందని చెప్పారు. ఇటీవలే రఫ్‌ టీజర్‌ కట్‌ చూశానని, అద్భుతంగా వుందని, రామ్‌ ఫ్యాన్స్ కు బ్లాస్టింగ్ గా వుంటుందని అన్నారు. ఈ సినిమాలో ఏ రోల్‌ ప్లే చేయడం లేదని చెప్పడం హీరోగా ప్రూవ్ చేసుకున్న తర్వాత తప్పకుండా తన తండ్రి మాదిరిగానే సినిమాలు డైరెక్ట్ చేస్తానని ఆకాష్ తెలిపారు.


‘బుజ్జిగాడు’ సీక్వెల్‌లో నటించే అవకాశాలున్నాయా? .. ''అది తెలుగు ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ ఫిల్మ్. థియేటర్లలో కన్నా టీవీల్లో బాగా ఆడిన సినిమా. మనం ఓన్ చేసుకున్న అలాంటి సినిమాలను మళ్లీ టచ్‌ చేయకపోవడమే బెటర్‌. రీరిలీజ్ చేసుకొని ఎంజాయ్ చెయ్యాలి'' అని అన్నారు. తన తండ్రి తెరకెక్కించిన సినిమాల్లో ‘నేనింతే’ అంటే ఇష్టమని, దానికి సీక్వెల్‌ చేయటానికి ఇష్టపడతానని అన్నారు. 


విలన్ రోల్స్ చేయటానికి రెడీగా ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా.. నన్ను ఇప్పటికీ చిన్నపిల్లాడిలా ఉన్నావని అంటున్నారు. ముందు నేను హీరోగా సెటిల్ అవ్వాలి. ఇప్పటికైతే అలాంటి రోల్స్ గురించి ఆలోచించడం లేదు అని నవ్వుతూ బదులిచ్చారు ఆకాష్. నార్మల్ తెలుగు ఆడియన్ గా హనుమాన్, కార్తికేయ 2 చిత్రాలని బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. అలాంటి సినిమాల్లో నటించేందుకు ట్రై చేస్తున్నానని, పలువురు దర్శక రచయితలతో డిస్కస్ చేస్తున్నారనే విషయాన్ని వెల్లడించారు.


ప్రభాస్ - పూరీ జగన్నాథ్ కలిసి మరో మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని, తప్పకుండా ఈ కాంబినేషన్ లో సినిమా వుంటుందని ఆకాష్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో స్టార్ డైరెక్టర్స్ తో తన తండ్రి సినిమాలు చేయటానికి కారణం కాంబినేషన్ సెట్ అవ్వకపోవడమే అని అంటున్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ స్టార్ హీరోలతో చేస్తారని చెప్పారు. చిరంజీవి - పూరీ కాంబోలోనూ సినిమా ఉంటుందని ఆకాశ్ ఆశాభావం వ్యక్తంచేశారు. రిలేషన్‌షిప్‌ స్టేటస్ గురించి అడగ్గా.. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని తెలిపారు.


Also Read: 'బంగారం' హీరోయిన్ వెడ్డింగ్ కార్డ్ వైరల్‌ - కాబోయే వరుడు ఎవరంటే?