టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. రీసెంట్ గా 'ఏజెంట్'తో భారీ డిజాస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడితో ఇక ఏ హీరో సినిమా చేయడనే వాదనల నేపథ్యంలో.. ఓ తమిళ స్టార్ హీరో సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు? డీటెయిల్స్​లోకి వెళ్తే.. సురేందర్ రెడ్డి దర్శకుడిగా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఈ రెండు దశాబ్దాలలో ఆయన చేసిన సినిమాలు పది మాత్రమే. ఆ పది సినిమాల్లో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. కానీ ఈ డైరెక్టర్ తీసిన 'అతనొక్కడే', 'కిక్', 'రేసుగుర్రం' వంటి సినిమాలు భారీ సక్సెస్ అందుకొని దర్శకుడిగా సురేందర్ రెడ్డి రేంజ్ పెంచాయి.


ఇక చివరిగా రామ్ చరణ్ తో తెరకెక్కించిన 'ధృవ' తర్వాత సురేందర్ రెడ్డికి ఇప్పటివరకు మరో సక్సెస్ రాలేదు. మెగాస్టార్​తో తీసిన 'సైరా నరసింహారెడ్డి' భారీ విజయాన్ని అందుకుంటుంది అనుకుంటే ఆ సినిమా అంతగా విజయాన్ని పొందలేదు. దాని నుంచి తేరుకునేలోపే అఖిల్​తో తీసిన 'ఏజెంట్' సురేందర్ రెడ్డి స్థానాన్ని మరింత దిగజార్చింది. అఖిల్ మార్కెట్​ను ఏ మాత్రం పట్టించుకోకుండా 'ఏజెంట్' సినిమా కోసం భారీగా ఖర్చు చేసి నిర్మాతలకు నష్టాలను మిగిల్చాడు సురేందర్ రెడ్డి. దాంతో ఇతనితో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు ముందుకు రాలేదు. ఏజెంట్ రిజల్ట్ చూసి అందరూ సూరితో సినిమాలు చేసేందుకు వెనకాడతారని అనుకున్నారు.


కానీ అనూహ్యంగా సురేందర్ రెడ్డి ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో తో సినిమా లైన్​లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు ఏకంగా ఇద్దరు హీరోలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు విక్టరీ వెంకటేష్ కాగా మరొకరు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. కొన్ని వారాల క్రితం సురేందర్ రెడ్డి వెంకటేష్​కి ఓ కథ వినిపించగా, ఆ కథ బాగా నచ్చడంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.


ఇక ఇటీవల చియాన్ విక్రమ్​తో కూడా ఓ సినిమాను ఓకే చేయించుకున్నారని, పాన్ ఇండియా రేంజ్​లో ఈ మూవీని చేయబోతున్నట్లుగా సురేందర్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంటనే సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.వెంకీ ప్రాజెక్టు తర్వాతే చియాన్ విక్రమ్ తో సురేందర్ రెడ్డి మూవీ ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


ఒకవేళ ఈ రెండు ప్రాజెక్టులతో మంచి సక్సెస్ అందుకుంటే కచ్చితంగా టాలీవుడ్​లో మళ్లీ మోస్ట్ బిజినెస్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి మారడం ఖాయమని చెప్పొచ్చు. ఇక వెంకటేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టనుంది. అటు చియాన్ విక్రమ్ పా.రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో 26 న ఈ మూవీ విడుదల కానుంది.


Also Read : 'హాయ్ నాన్న' థర్డ్ సింగిల్ - నాని, మృణాల్ కెమిస్ట్రీ అదుర్స్, సాంగ్ ఎప్పుడంటే?






Join Us on Telegram: https://t.me/abpdesamofficial