Aditya Dhar About The Immortal Ashwatthama: జాతీయ అవార్డు గ్రహీత, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధ‌ర్ హిందీలో ‘ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌’ పేరుతో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. జాతీయ అవార్డు గ్రహీత, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధ‌ర్ భారీ మైథలాజికల్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం అల్లు అర్జున్, విక్కీ కౌశల్ సహా పలువురి పేర్లు వినిపించాయి. చాలా రోజుల పాటు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ప్రాజెక్టు మాత్రం ప్రారంభం కాలేదు. ఇంతకీ ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే విషయంలోనూ ఎలాంటి క్లారిటీ లేదు.


‘ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌’ను వాయిదా వేశాం- ఆదిత్య


తాజాగా ‘ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌’ సినిమా గురించి ఆదిత్య ధ‌ర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా నిలిచిపోవడానికి గల కారణాలను వివరించారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆర్టికల్ 370’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ సినిమా పనులను వాయిదా వేసినట్లు చెప్పారు. దానికి కారణాలు ఏంటో కూడా చెప్పారు.  


“మేము ‘ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌’ చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశాం. నేను ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉంటాను. అందుకే ఈ సినిమా ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు. ఇప్పుడున్న భారతీయ సినీ పరిశ్రమకు ఈ సినిమా చాలా పెద్దది అని భావించాను. నేను ఊహించే వీఎఫ్ఎక్స్ కూడా చాలా పెద్దస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ప్రయత్నించలేం. సాంకేతికత అందుబాటులోకి వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నాం” అన్నారు.


ఈ సందర్భంగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌ను ఆదిత్య ఉదాహరణగా పేర్కొన్నారు. యుఎస్ ఫిల్మ్ మేకర్ కామెరూన్ కూడా తన సినిమాల విషయంలో మార్కెట్ పెరిగే వరకు వేచి ఉన్నారని గుర్తు చేశారు. "కామెరూన్ కూడా మార్కెట్ పెరగడంతో పాటు సాంకేతికత తనకు అనుకూలంగా వచ్చే వరకు ఎదురు చూశారు. వాస్తవానికి నేను ఆయన అంతటి వాడిని కాదు. కానీ, మనం విజయం సాధించాలంటే ఏ విషయంలోనూ వెనుకడుగు వేయకూడదు. అందుకే ప్రస్తుతానికి ఈ సినిమాను టేకప్ చేయం లేదు. నా ప్రైమ్ టైమ్‌కి ఐదేళ్లు పట్టినా, సినిమా అద్భుతంగా ఉండాలనే భావిస్తున్నాను” అని అన్నారు.


ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు ‘ఆర్టికల్ 370’


ఆదిత్య తన తొలి చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్‌’తో దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. తాజాగా ‘ఆర్టికల్ 370’ పేరుతో  ఓ సినిమాను నిర్మించారు. దీనికి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. యామీ గౌతమ్, ప్రియమణి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ ట్రైలర్ లాంచ్లో ఆదిత్య, యామి దంపతులు కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు తెలిపారు. అటు ‘ధూమ్ ధామ్’ అనే సినిమాను కూడా తెరకెక్కించబోతున్నారు ఆదిత్య. ప్రస్తుతం ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.


Read Also: వాళ్లు ఎంగిలి కూడుకు ఆశపడ్డారు, అవార్డులు రాకుండా చేసినందుకు థ్యాంక్స్ చెప్పా - మోహన్ బాబు కామెంట్స్ వైరల్