పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ.. టీజర్ ఎంత దుమారం లేపిందో తెలిసిందే. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో మూవీలో మార్పులుంటాయని అంతా భావించారు. ట్రైలర్‌ను కూడా అందుకు తగినట్లుగానే వివాదాలకు ఆస్కారం లేకుండా కట్ చేసి రిలీజ్ చేశారు. ఇక మూవీని థియేటర్లలో విడుదల చేసిన తర్వాత అసలు కథ మొదలైంది. దర్శకుడు ఓం రౌత్.. తాను అనుకున్నదే చూపించాడు. మూవీలో ఎలాంటి మార్పులు చేయకుండా రిలీజ్ చేశాడు. మొదట్లో అంతా రావణుడి లుక్ గురించి మాట్లాడుకున్నారు. మూవీ విడుదలైన తర్వాత అందులోని డైలాగ్స్‌ కూడా వివాదాలకు దారితీసింది. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. చిత్రయూనిట్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఎట్టకేలకు మూవీలోని డైలాగులను మార్చి వివాదాలకు తెరదించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. 


రూ.150లకే ‘ఆదిపురుష్’ టికెట్


‘ఆదిపురుష్’ మూవీపై అంచనాలు పెరగడంతో భారీస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగాయి. దీంతో మూవీ రిలైజన మొదటి మూడు రోజులు భారీగా వసూళ్లను సాధించింది. అయితే, సోమవారం నుంచి ఒక్కసారిగా కలెక్షన్లు డౌన్ అయ్యాయి. దీంతో ‘ఆదిపురుష్’ డిజస్టర్‌ దిశగా ప్రయాణిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆదిపురుష్’ 3డీ స్క్రీనింగ్ రేట్లను భారీగా తగ్గించారు. అయితే, ఈ ఆఫర్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకలో వర్తించదని ట్విస్ట్ ఇచ్చారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లోనే ‘ఆదిపురుష్’ మూవీపై విమర్శలు వస్తున్నాయి.


వివాదాలు, నిరసనల నేపథ్యంలో కలెక్షన్లు కూడా భారీగా తగ్గాయి. దీంతో ఆ నష్టాన్ని పూడ్చుకొనే ప్రయత్నంలో నిర్మాతలు ఈ ఆఫర్ ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇబ్బంది లేదు. ఇప్పటికీ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ ఆ మూవీకి పోటీనిచ్చే స్టార్ హీరోల మూవీస్ ఏవీ లేకపోవడంతో ‘ఆదిపురుష్’కు కలిసివస్తోంది. అందుకే, నిర్మాతలు ఆ ఆఫర్‌ను ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నెల 22, 23 తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. రూ.150తోపాటు 3D గ్లాసెస్ కోసం అదనంగా చెల్లించాలి. సోమ, మంగళ, బుధవారాల్లో పడిపోయిన కలెక్షన్లను గురు, శుక్రవారాల్లో తిరిగి పొందాలనేది నిర్మాతల ప్లాన్. వీకెండ్‌లో ఎలాగో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి.. ఆఫర్‌ను ఈ రెండు రోజులకే పరిమితం చేశారు. అదన్నమాట సంగతి. 






దేశవ్యాప్తంగా విమర్శలు..


‘ఆదిపురుష్’ దర్శకుడు ఓమ్ రౌత్ పై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే సినిమాపై నెగిటివ్ టాక్ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఇక మూవీలోని లుక్స్, డైలాగ్స్ పై వస్తోన్న విమర్శలు అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. రామాయణం ఇతిహాసాల ఆధారంగా చేసుకొని సినిమా తీసి అందులో భాషను సరిగ్గా పెట్టలేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ పై ఎక్కువగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ తన రైటింగ్ ను సమర్థిస్తూ ఓ పోస్ట్ చేశారు. దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో ఆ పోస్ట్ ను తొలగిస్తానని ప్రకటించారు. అలాగే మూవీ నిర్మాతలు కూడా సినిమాలో డైలాగ్స్ ను మార్చి కొత్తగా మళ్లీ రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి ఈ విమర్శలు ఇక్కడితో ఆగుతాయో లేదో చూడాలి. ఇక ఈ మూవీను టి-సిరీస్, రెట్రోఫిల్స్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించారు.