Actress Namitha Denied Entry In to Temple Video Viral: న‌టి న‌మిత‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. త‌మిళ‌నాడులోకి మ‌ధుర మీనాక్షి ఆల‌యంలోకి ఆమెను అనుమ‌తించ‌లేదు సిబ్బంది. ఆమెతో దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో ఆవేద‌న‌కు గురైన న‌మిత ఏం జ‌రిగిందో చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. త‌న‌తో అలా ప్ర‌వ‌ర్తించ‌డం చాలా బాధ క‌లిగించింది అంటూ న‌మిత అన్నారు. న‌మిత రిలీజ్ చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. త‌న‌ను సర్టిఫికెట్ అడిగార‌ని, ఎంత చెప్పినా విన‌లేద‌ని ఆమె ఆ వీడియోలో అన్నారు. అస‌లు ఏం జ‌రిగిందంటే? 


వివాదం ఏంటంటే? 


త‌మిళ‌నాడులోని కొన్ని దేవాల‌యాల్లోకి అన్య‌మ‌తస్థుల‌ను అనుమ‌తించ‌రు. అలా న‌మిత‌ను కూడా అనుమ‌తించలేదు ఆల‌య సిబ్బంది. ‘‘కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో పాల్గొనేందుకు నా కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి మీనాక్షి దేవాల‌యానికి వెళ్లాను. ఆల‌య సిబ్బంది న‌న్ను లోప‌లికి వెళ్ల‌నివ్వ‌కుండా ఆడ్డుకున్నారు. నాకు సంబ‌ధించిన స‌ర్టిఫికెట్స్ చూపించ‌మ‌న్నారు. వాళ్లు అలా అడ‌గ‌డం నాకు చాలా బాధ  క‌లిగించింది. త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఉన్న చాలా దేవాల‌యాల‌కు నేను వెళ్లాన‌ని చెప్పాను. అయినా వాళ్లు వినిపించుకోలేదు. నేను తిరుమ‌ల‌లో పెళ్లి చేసుకున్నాను. నేను హిందువును. నా పిల్ల‌లు కూడా హిందువులే. న‌న్ను అడ్డుకున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా’’ అని నమిత వీడియో రిలీజ్ చేశారు. ఈ మేర‌కు ఆమె దేవాదాయ‌శాఖ‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 






నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే చేశాం: నిర్వాహకులు


అయితే, న‌మిత చేసిన కామెంట్స్ పై స్పందించారు ఆల‌య ప‌రిపాల‌న సిబ్బంది. ‘‘నమితతో ఎవరూ అమర్యాదకరంగా మాట్లాడ‌లేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో అలా మాట్లాడారు. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పాం. తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించాం’’ అని వివ‌ర‌ణ ఇచ్చారు. 


అప్పుడు గుడి క‌ట్టారు.. ఇప్పుడు ఇలా.. 


న‌మిత వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. అప్పుడేమో ఆమెకు గుడిక‌ట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వ‌డం లేదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్ లో న‌మిత అభిమానులు ఆమెకు గుడి క‌ట్టించారు. ఆమె న‌ట‌న‌, అందం, అమాయకత్వం.. వీటన్నింటిని చూసి ఆమెకు గుడి కట్టించామ‌ని అప్ప‌ట్లో అభిమానులు చెప్పారు. 


పెళ్ల‌య్యాక సినిమాలకు దూరం


గుజ‌రాత్ కు చెందిన న‌మిత తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. 'సొంతం', 'జెమిని', 'బిల్లా', 'ఒక రాజా ఒక రాణి', 'ఓ రాధ ఇద్ద‌రు కృష్ణులు', 'మ‌న్యంపులి' త‌దిత‌ర సినిమాల్లో న‌టించారు. తెలుగులో ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఆమె రాజ‌కీయాల్లో ఉన్నారు.  1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానంలో నిలిచారు న‌మ‌త‌. బొద్దుగా ఉన్న‌ప్ప‌టికీ ఆమెకు మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. 'సింహ' సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించింది. కాగా.. పెళ్ల‌య్యాక పూర్తిగా సినిమాల‌కు గుడ్ బై చెప్పారు. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరి పెళ్లి తిరుప‌తిలో ఘ‌నంగా జ‌రిగింది. న‌మిత మ‌గ క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చింది.


Also Read: అందుకే నా జాతకం చెప్ప‌లేదేమో, వేణు స్వామిపై నారా రోహిత్ పంచ్