Suriya Daughter Diya Directorial Debut With Documentary Film: ఇండస్ట్రీలోకి మరో వారసురాలి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుమార్తె దియా సైలెంట్గా ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్కు దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఆస్కార్ అర్హత కోసం ప్రదర్శించనుండగా... తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.
ఆస్కార్ అర్హత కోసం
సూర్య జ్యోతిక దంపతుల కుమార్తె దియా సైలెంట్గానే ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేశారు. సినిమా తీయడంలో తెర వెనుక చాలా మంది మహిళలు పడే కష్టం, వాళ్లు పడే ఇబ్బందులే ప్రధానాంశంగా 'లీడింగ్ లైట్' అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సూర్య జ్యోతిక తమ ప్రొడక్షన్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. ఆస్కార్ అర్హత కోసం ఈ మూవీని ప్రస్తుతం కాలిఫోర్నియాలోని రీజెన్సీ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకూ ప్రతీ రోజూ ఈ డాక్యుమెంటరీ ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సూర్య దంపతులు వెల్లడిస్తూనే తమ కుమార్తెకు అభినందనలు తెలిపారు. మరోవైపు నెటిజన్లు కూడా ఆమెకు విషెష్ చెబుతున్నారు.
ఇటీవలే స్కూలింగ్ పూర్తి చేసుకున్న దియా ఫస్ట్ టైం ఓ ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో డాక్యుమెంటరీ తీసి దర్శకురాలిగా మారారు. ఆమె రచయితగా, డైరెక్టర్గా మారిన విషయాన్ని ఇప్పటివరకూ సూర్య, జ్యోతిక కపుల్ గోప్యంగానే ఉంచారు. ఏ మాత్రం హడావుడి లేకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలంటూ సూర్య ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇక సూర్య సినిమాల విషయానికొస్తే... రీసెంట్గా రెట్రో మూవీతో ప్రేక్షకులను అలరించారు సూర్య. తమిళంలో మంచి టాక్ సొంతం చేసుకున్నా... తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సూర్య డైరెక్ట్గా తెలుగులో వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్నారు. ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా చేస్తుండగా... రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య కెరీర్లో ఇది 46వ సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్తో మూవీ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని డిఫరెంట్ రోల్లో సూర్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాకు 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
ఇక తమిళంలోనూ 'కరుప్పు' మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో సూర్య సరసన త్రిష హీరోయిన్గా చేస్తుండగా... ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.