గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డూ విషయంలో వీరిద్దరి మధ్య మొదలైన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. మరి ఆ ట్వీట్ లో ఏముందో చూసేద్దాం పదండి.


పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశారు. 'సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి.. సమాజ రక్షణలో మేముంటాం.. జస్ట్ ఆస్కింగ్' అంటూ ఆయన పరోక్షంగా సెటైర్ వేయగా, ప్రస్తుతం ప్రకాష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సమంత, అక్కినేని ఫ్యామిలీ పై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై టాలీవుడ్ మొత్తం ఏక తాటిపైకి వచ్చి తమ గళాన్ని వినిపించింది. రాజకీయాల జోలికి వెళ్ళని, సినిమాలో తప్ప నిజ జీవితంలో నటించలేని తమలాంటి నటుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించకపోవడం వల్లే ప్రకాష్ రాజ్ ఇన్ డైరెక్ట్ గా ఇలా కౌంటర్ వేశారని అనుకుంటున్నారు నెటిజన్లు. సొంత సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగితే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వివాదంపై ఇంకా నోరు మెదపకపోవడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.







'రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దు' అంటూ పవన్ కళ్యాణ్ ను టైం దొరికినప్పుడల్లా ప్రకాష్ రాజ్ విమర్శిస్తూనే ఉన్నారు. గురువారం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్రానికి పలు సూచనలు చేస్తూ డిక్లరేషన్ ను ఆయన రిలీజ్ చేశారు. ఈ సభలో పవన్ మాట్లాడుతూ ఇతర మతాల గురించి ఎవరైనా నోరెత్తితే చాలు చిత్ర పరిశ్రమ, వ్యాపారస్తులు, నటులు అందరూ మాట్లాడతారని, కానీ సనాతన ధర్మంపై దాడులు జరిగితే ఒక్కరు కూడా స్పందించరు అంటూ ఆరోపించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు. ప్రకృతిలోని ప్రతి జీవి సుఖంగా ఉండాలనేది సనాతన ధర్మంలోని ముఖ్య అంశమని, సనాతన ధర్మంపై దాడులు జరిగితే పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ధైర్యంగా గొంతు విప్పాలని కోరారు. ఇక సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడడమే కాకుండా తన ప్రాయశ్చిత దీక్షను కూడా అవహేళన చేశారు అంటూ ఈ సభ వేదికగా పవన్ ఫైర్ అయ్యారు. కానీ ఇటువైపు కొండా సురేఖ నాగార్జున వివాదంపై ఇండస్ట్రీ మొత్తం అగ్గి మీద గుగ్గిలం అవుతుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ తన గళాన్ని వినిపించడం ఏంటో అని సినీ అభిమానులకు సైతం అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా ఇదే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించారు.


Also Readశ్రీ విష్ణు 'స్వాగ్'ఓటీటీ పార్ట్నర్ ఏది? ఆ సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?