Actor and Comedian Visweswara Rao Died: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ దాసి సుదర్శన్‌ మరణ వార్త నుంచి కోలుకోకముందే తెలుగు ఇండస్ట్రీలో మరో విషాద వార్త బయటకు వచ్చింది. తమిళ, తెలుగులో హాస్య నటుడిగా ఎంతో గుర్తింపు పొందిన గరిమెళ్ళ విశ్వేశ్వర రావు (62) మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం (ఏప్రిల్‌ 2న) తుదిశ్వాస విడిచారు. నేడు ఉదయం ఆయన చెన్నైలోని సిరుచ్చేరిలోని తన నివాసంలో మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో తెలుగు, తమిళ్‌ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


ఆయన మరణావార్త తెలిసి టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, నటీనటులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆయన భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం తమిళనాడులోని సిరుశేరి గ్రామంలోని ఆయన నివాసంలో ఉంచినట్టు తెలుస్తోంది. ఇక రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు చేయనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా విశ్వేశ్వర రావు స్వస్థలం కాకినాడ కాగా.. ఆరేళ్ల వయసులోనే ఆయన  చైల్డ్‌ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ని ప్రారంభించారు. బాలమిత్రుల కథ, ఓ సీత కథ, మా నాన్న నిర్దోషి, పొట్టి ప్లీడర్‌,భక్తి పోతన, అందాల రాముడు, సిసింద్రీ చిట్టిబాబు వంటి చిత్రాల్లో ఆయన బాల నటుడిగా నటించారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గానే ఆయన దాదాపు 150కి పైగా సినిమాలు చేయడం విశేషం.


Also Read: సర్‌ప్రైజ్‌ చేస్తున్న కరీనా, టబు 'క్రూ' మూవీ వసూళ్లు - నాలుగు రోజుల్లోనే అన్ని కోట్లు రాబట్టిందా!


ఆ తర్వాత తెలుగులో 'ముఠా మేస్త్రీ', 'ప్రెసిడెంట్‌గారి పెళ్లాం', 'ఆమె కథ।', 'ఆయనకు ఇద్దరు', 'అక్కడ అమ్మాయి' - ఇక్కడ అబ్బాయి, 'మెకానిక్ అల్లుడు', 'శివాజీ', 'అవును- వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' వంటి సినిమాలతో హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అలాగే తమిళంలోనూ ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. అలా తెలుగు, తమిళంలో సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన టీవీ సీరియల్స్‌నూ తనదైన కామెడీ పండిచారు. దాదాపు 150కి పైగా సీరియల్స్‌లోనూ నటించిన వెండితెర, బుల్లితెరపై స్టార్‌ నటుడిగా మారారు.