బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో గాయపడ్డారు. ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణలో ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో తనకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తన బ్లాగ్ లో ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా కొద్ది రోజులు అన్ని షూటింగ్స్ వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో ఈ వారం అభిమానులను కలవలేకపోతున్నట్లు  వెల్లడించారు.


‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో గాయపడ్డ అమితాబ్


నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరగగా, తాజాగా ఆయన ఈ విషయాన్ని బ్లాగ్ ద్వారా తెలిపారు.‘‘’ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఈ షూటింగ్ లో నేను గాయపడ్డాను. యాక్షన్ సీన్లు షూట్ చేస్తునప్పుడు గాయపడ్డాను. కుడివైపు పక్కటెములకు దెబ్బ తగిలింది. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను. వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తగిన చికిత్స తీసుకున్నాను. శ్వాస తీసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. డాక్టర్లు కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు కొద్ది రోజుల పాటు అన్ని షూటింగ్స్ వాయిదా వేసుకుంటున్నాను. ముంబైలోని నా నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇవాళ సాయంత్రం అభిమానులను కలవాల్సి ఉన్నా, కలవలేకపోతున్నాను” అంటూ ఆయన వెల్లడించారు.   


నాలుగు రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం


నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో  ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్ లో అమితాబ్ పాల్గొన్నారు. అయితే,  చిత్రీకరణ సమయంలో అమితాబ్ కింద పడినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనను చిత్ర బృందం హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అనంతరం ఆయన ముంబైకి వెళ్లిపోయారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ఆయన షూటింగ్ లో పాల్గొననున్నారు.


రూ. 500 కోట్లతో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’


'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది.  ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పడుకొనే, దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమిత్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ కావొచ్చింది. కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. వాటిని తాజాగా చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రూ.500 కోట్లతో వైజయంతి మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి  12న విడుదల కానుంది.






Read Also: ప్రదర్శనలో పెను ప్రమాదం, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఏఆర్ రెహమాన్ కొడుకు!