బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) సినిమా థియేటర్లలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. 'లాల్ సింగ్ చద్దా' తర్వాత ఆయన మరొక సినిమా చేయలేదు.‌ ఇప్పుడు ఆయన కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అది మహేష్ బాబు స్నేహితుడుగా ముద్ర పడిన తెలుగు దర్శకుడితో ఆయన ఒక సినిమా చేయబోతున్నారని టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే...


వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్?
సౌత్ ఇండియన్ దర్శకులతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ బడా హీరోలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తీసిన 'కబీర్ సింగ్', 'యానిమల్' షాహిద్ కపూర్, రణబీర్ కపూర్‌లకు భారీ బ్లాక్ బస్టర్లు ఇచ్చాయి. తమిళ దర్శకుడు అట్లీతో షారుక్ ఖాన్ చేసిన 'జవాన్' ఆయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్లీ ఊపిరి పోసిందని చెప్పాలి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సైతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'సికిందర్' సినిమా చేస్తున్నారు. అంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో సినిమాలు చేశారు. వీళ్ళందరి కంటే ముందు సౌత్ దర్శకుడితో సినిమా చేసిన బాలీవుడ్ ఖాన్ హీరో ఆమిర్. 


ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'గజినీ' సినిమాను అతనితో హిందీలో రీమేక్ చేశారు ఆమిర్ ఖాన్. అది భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం సౌత్ దర్శకుడి వైపు ఆయన చూస్తున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నారట. 'దిల్' రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.


'లాల్ సింగ్ చద్దా'ను ఎన్నో ఆశలు, అంచనాలతో చేశారు ఆమిర్. హాలీవుడ్ హిట్ 'ఫారెస్ట్ గంప్'ను హిందీలో రీమేక్ చేశారు. డ్రీమ్ ప్రాజెక్ట్ కాస్త బాక్స్ ఆఫీస్ బరిలో బోల్తా కొట్టడంతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కమర్షియల్ అంశాలతో కూడిన కంటెంట్ బేస్డ్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట.


Also Read: ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?



వంశీ పైడిపల్లికి దర్శకుడిగా అవకాశం ఇచ్చినది 'దిల్' రాజు. 'మున్నా'తో అతడిని  దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ తర్వాత అతనితో వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. వంశీ పైడిపల్లి లాస్ట్ సినిమా 'వారసుడు' నిర్మాత కూడా దిల్ రాజే. ఆ సినిమా (వారిసు)తో వంశీని తమిళ చలనచిత్ర పరిశ్రమకు తీసుకు వెళ్లిన 'దిల్' రాజు... ఇప్పుడు ఆమిర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట.


వంశీ పైడిపల్లి సినిమా చేసి ఏడాదిన్నర దాటింది. విజయ్ హీరోగా ఆయన తీసిన 'వారసుడు' గత ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయన కొత్త సినిమా కబుర్లు బయటకు రాలేదు. షాహిద్ కపూర్ హీరోగా వంశీ పైడిపల్లి సినిమా చేస్తారని వినిపించినా... చివరకు ఆ కథ ఆమిర్ దగ్గరకు వెళ్లిందట. త్వరలో ఈ సినిమా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.


Also Read: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - డిజప్పాయింట్ అవ్వొద్దంటున్న తమన్!