ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే ఆయన ఈరోజు 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

 

మెగాస్టార్ చిరంజీవి సైతం.. శివశంకర్ మాస్టర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'ఆచార్య' సెట్ లో ఆయన్ను కలిశానని.. అదే చివరిసారి అవుతుందనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. 

''శివశంకర్ మాస్టర్‌, నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్‌గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. చరణ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు'' అంటూ చిరంజీవి ట్విట్టర్ లో రాసుకొచ్చారు.