బిగ్ బాస్‌ను విమర్శించే వారు ఎంతమంది ఉన్నారో.. దానిని ఆసక్తికరంగా చూసేవారు కూడా అంతేమంది ఉన్నారు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా.. బిగ్ బాస్ టీఆర్‌పీ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్‌లోని అన్ని ఎపిసోడ్స్‌లో చాలా కీలకమైనవి రెండు. ఒకటి లాంచ్ ఎపిసోడ్, మరొకటి ఫైనల్ ఎపిసోడ్. ఈ రెండు ఎపిసోడ్స్ విషయంలో బిగ్ బాస్ ఒక సీజన్ తర్వాత మరొక సీజన్.. టీఆర్‌పీ విషయంలో పోటీపడుతూనే ఉంటాయి. అయితే ఇప్పటివరకు తెలుగులో 6 బిగ్ బాస్ సీజన్లు జరిగాయి. అందులో నాలుగో సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కు 21.7 శాతం టీఆర్‌పీ రేటింగ్ లభించి అన్ని ఫైనల్ ఎపిసోడ్స్ కంటే అత్యధిక టీఆర్‌పీ సాధించిన ఎపిసోడ్‌గా నిలిచింది. 


16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలు


బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మోనాల్ గజ్జర్, సూర్యకిరణ్, లాస్య మంజునాథ్, అభిజీత్, సుజాత, అలేఖ్య హారిక, దేవి నాగవళ్లి, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, నోయెల్ సీన్, దివి, అఖిల్ సార్థక్, అరియానా గ్లోరీ, సోహెల్, గంగవ్వ. మామూలుగా గంగవ్వ లాంటి ఒక వృద్ధురాలు బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా రావడం కేవలం తెలుగులో మాత్రమే కాదు పూర్తిగా బిగ్ బాస్ అన్ని భాషల్లో కలిపి ఇదే మొదటిసారి. కానీ ఆమె వచ్చిన మొదటిరోజే ఆడియన్స్ కూడా తను ఎక్కువ రోజులు హౌజ్‌లో ఉండలేదని అనుకున్నారు. అనుకున్నట్టుగానే కొన్నిరోజులకే ఏ ఎలిమినేషన్ లేకుండా హౌజ్‌లో ఉండలేనని తను బిగ్ బాస్ నుంచి తప్పుకుంది. కానీ హౌజ్‌లో ఉన్నంతకాలం అందరితో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది.


ట్రయాంగిల్ లవ్ స్టోరీ


బిగ్ బాస్ హౌజ్‌లో ప్రతీ సీజన్‌లో ఏదో ఒక ప్రేమజంట ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది. కానీ బిగ్ బాస్ 4లో మాత్రం ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రియేట్ అయ్యింది. అభిజిత్, మోనాల్, అఖిల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్ట్ అయ్యారు. మోనాల్ ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతుంది అన్న విషయంలో చివరివరకు కూడా క్లారిటీ రాలేదు. కానీ అఖిల్ మాత్రం మోనాల్‌ను ఇష్టపడుతున్నాడన్న విషయంలో చాలా క్లియర్‌గా కనిపించేది. సీజన్ మొదట్లో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న అభిజిత్, అఖిల్‌కు మోనాల్ వల్ల గొడవలు కూడా అయ్యాయి. ఎలిమినేషన్‌కు నామినేషన్స్ వచ్చేసరికి ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడానికి కారణాలు వెతకడం మొదలుపెట్టారు. అలా వీరిద్దరి మధ్య వాగ్వాదాలు కూడా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను కలిగించాయి. కొన్నాళ్లకు అఖిల్‌ను, మోనాల్‌ను పూర్తిగా దూరం పెట్టిన అభిజిత్.. అలేఖ్య హారికకు దగ్గరయ్యాడు.


గొడవలకు కేరాఫ్ అడ్రస్‌గా ఆ ముగ్గురు


ఇక సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి.. హౌజ్‌లోకి ఎంటరైన దగ్గర నుంచి అందరితో గొడవలు మొదలుపెట్టేశారు. కరాటే కళ్యాణి అయితే ఆ గొడవల వల్ల మొదటి వారంలోనే హౌజ్ నుంచి ఎలిమినేట్ కూడా అయిపోయింది. సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ కూడా అందరితో కలిసిపోయినట్టుగా కాకుండా అందరినీ విమర్శించడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందుకే వారు ఎక్కువగా తోటి కంటెస్టెంట్స్‌కు కూడా నచ్చలేదు. మెల్లగా అమ్మ రాజశేఖర్ తన పద్ధతిని మార్చుకుంటూ, అందరితో కలిసిపోతూ కాస్త ఎక్కువకాలమే హౌజ్‌లో కొనసాగగలిగారు. సింగర్ నోయెల్ తన ఆరోగ్య పరిస్థితి వల్ల మధ్యలోనే బిగ్ బాస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక కోపంలో సోహెల్ అరిచే అరుపులు, తన కోపం అంతా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది. మెహబూబ్‌తో సోహెల్ బ్రోమాన్స్ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సుజాత, లాస్య లాంటి కంటెస్టెంట్స్ ఎక్కువగా కాంట్రవర్సీలు లేకుండా తమ బిగ్ బాస్ జర్నీలను పూర్తిచేశారు.


ఫైనల్‌గా ఎవరంటే


దివి, అరియానా లాంటి వారు బిగ్ బాస్‌లో గ్లామర్ డోస్‌ను యాడ్ చేశారు. జర్నలిస్ట్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అని చాలామంది ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ఇక అన్ని రకాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ.. టాస్క్‌లలో చురుగ్గా పాల్గొంటూ అయిదుగురు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. వారే అభిజిత్, అఖిల్, అలేఖ్య హారిక, అరియానా, సోహెల్. ముందుగా ఇద్దరు అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అభిజిత్, అఖిల్, సోహెల్ మిగిలారు. అప్పుడు సోహెల్ తనకు వచ్చిన మనీ బ్యాగ్ ఆఫర్‌తో స్వయంగా ట్రాఫీ వద్దని తప్పుకున్నాడు. మిగిలిన అభిజిత్, అఖిల్‌తో బిగ్ బాస్ ట్రాఫీ.. అభిజిత్‌నే వరించింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ ట్రాఫీని అందుకున్నాడు ఈ ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ హీరో.


Also Read: 'ఖుషి' రివ్యూ : విజయ్ దేవరకొండ, సమంత జోడీ హిట్టు, మరి సినిమా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial