బిగ్ బాస్ సీజన్ 7లో 2.0 వెర్షన్ మొదలయ్యింది. ఇందులో ఏది మారినా.. మారకపోయినా.. నామినేషన్స్ తీరు మాత్రం ఏం మారలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌గా విడిపోయారు. అయిదు వారాల నుంచి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను ఆటగాళ్లు అని, కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అయిదుగురు కంటెస్టెంట్స్‌తో పాటు సీక్రెట్ రూమ్ నుంచి రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కూడా పోటుగాళ్లు టీమ్‌గా విడిపోయారు. ఆరవ వారంలో ఆటగాళ్ల నామినేషన్ ప్రక్రియ ఒకసారి, పోటుగాళ్ల నామినేషన్ ప్రక్రియ ఒకసారి జరిగింది. ఈవారం ఎవరెవరు నామినేట్ అయ్యారని బిగ్ బాస్ ప్రకటించిన తర్వాత గౌతమ్.. హౌజ్‌లోకి రీఎంట్రీ ఆటను మరో మలుపు తిప్పాడు.


నామినేషన్స్‌లో ఎనిమిది మంది..


బిగ్ బాస్ సీజన్ 7లో ఆరవ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ సందీప్, అమర్‌దీప్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, శోభా శెట్టి, నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి. పోటుగాళ్లు టీమ్ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యి ఒకరోజే అయినా నామినేషన్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ముందుగా బిగ్ బాస్.. ఆటగాళ్లను నామినేట్ చేయమని పోటుగాళ్లను రంగంలోకి దింపారు. దీంతో పోటుగాళ్లకు నామినేషన్స్ ఉండవేమో అనుకున్నారంతా. కానీ ఆటగాళ్లను నామినేట్ చేయడం పూర్తయిన కాసేపటి తర్వాత పోటుగాళ్లను కూడా నామినేట్ చేయవలసి ఉంటుందని అవతలి టీమ్‌కు ఆదేశానిచ్చారు బిగ్ బాస్. అలా రెండు టీమ్స్ నుంచి కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు.


ఒకరి టీమ్‌పై మరొక టీమ్ ఆరోపణలు..


బిగ్ బాస్ హౌజ్‌ను అయిదు వారాలు బయట నుంచి గమనించిన పోటుగాళ్లు టీమ్.. ముందు నుంచి కంటెస్టెంట్స్ చేసిన తప్పులన్నీ గుర్తుచేస్తూ వారిని నామినేట్ చేశారు. అమర్‌దీప్ ఆట బాలేదని, అవతల వాళ్లు చెప్పేది వినడానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ అమర్ అసలు ప్రయత్నించడం లేదనే కారణంతో తనను నామినేట్ చేశారు. అర్జున్ అంబటి.. అమర్‌దీప్‌కు మంచి స్నేహితుడు. అయినా కూడా అదే కారణంతో తనను నామినేట్ చేయడాన్ని అమర్ తట్టుకోలేకపోయాడు. ఇక పవర్ అస్త్రా టాస్క్‌లో సందీప్, తేజ.. గౌతమ్ విషయంలో తప్పులు చేశారని గుర్తుచేస్తూ.. వారిని కూడా నామినేట్ చేశారు. ఇక అశ్విని శ్రీ, నయని పావనిల ప్రవర్తన నచ్చని కొందరు ఆటగాళ్లు.. వారిని కూడా నామినేట్ చేశారు. పూజా మూర్తిని నామినేట్ చేయడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. అమర్‌దీప్‌.. తనను పూజా నామినేట్ చేసిందని కోపంతో తనను రివర్స్‌లో నామినేట్ చేశాడు. ఇక శివాజీ సైతం పూజా.. టాస్కుల్లో సరిగా ఆడలేదని అంచనా వేసి తనను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు.


సీక్రెట్ రూమ్ నుంచి బయటికి వచ్చి గౌతమ్ ట్విస్ట్..


నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఎనిమిది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారని బిగ్ బాస్ ప్రకటించారు. అదే సమయంలో గౌతమ్.. సీక్రెట్ రూమ్ నుంచి బయటికి వచ్చాడు. అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అని అరుచుకుంటూ బయటికి వచ్చిన గౌతమ్‌ను చూసి కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. హౌజ్‌లోకి రాగానే పాత కంటెస్టెంట్స్ అంతా తనను పలకరించడానికి ప్రయత్నించినా.. అది పట్టించుకోని గౌతమ్.. కొత్త కంటెస్టెంట్స్ దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన పేరును అశ్వద్ధామ గౌతమ్ అని చెప్పుకున్నాడు. ఇక అప్పుడే రీఎంట్రీ ఇచ్చిన గౌతమ్‌కు బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేయవచ్చని లేదా సేఫ్ జోన్‌లో ఒకరిని నామినేట్ చేయవచ్చని అన్నారు. దీంతో సందీప్‌ను సేవ్ చేస్తున్నట్టు ప్రకటించాడు గౌతమ్. నామినేషన్స్‌లో ఉండడం ఎంత ఒత్తిడికి గురిచేస్తుందో తనకు తెలుసని, అందుకే సందీప్‌ను సేవ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. గౌతమ్ ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో చివరిగా నామినేషన్స్‌లో ఏడుగురు మిగిలారు.


Also Read: కొంతమంది ఇష్టపడతారు, మరికొందరు తిడతారు - అందుకే అలాంటి పాత్రలు: అనసూయ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial