Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ప్రస్తుతం హౌజ్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ ఎనిమిది మంది ఫైనల్స్‌కు చాలా చేరువగా ఉండడంతో వారు ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంటారు అనే విషయాన్ని నాగార్జున రివీల్ చేశారు. రివీల్ చేసిన తర్వాత.. ఆ ప్రైజ్ మనీతో ఎవరెవరు ఏం చేస్తారు ఏయే పనులు చేస్తారో కనుక్కున్నారు. తమ కలలను చెప్తూ పలువురు కంటెస్టెంట్స్ ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా ఎక్స్‌ట్రాగా మరికొన్ని కాస్ట్‌లీ గిఫ్ట్స్ కూడా లభించనున్నాయని నాగార్జున బయటపెట్టారు.


విన్నర్‌కే అన్ని..
బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌గా నిలిచేవారికి ట్రోఫీతో పాటు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ కూడా దక్కనుందని నాగార్జున రివీల్ చేశారు. దాంతో పాటు మారుతీ సుజూకీ బ్రెజా కారు కూడా గిఫ్ట్‌గా లభిస్తుందని తెలిపారు. ఈ రెండు మాత్రమే కాకుండా రూ.15 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా విన్నర్ సొంతమవుతుందని నాగ్ చెప్పారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా తెగ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఆ రూ.50 లక్షలు తమకే వస్తే ఏం చేస్తారు అని కంటెస్టెంట్స్.. ఒక్కొక్కరుగా చెప్పుకొచ్చారు.


సొంతింటి కలలు..
ముందుగా గౌతమ్ వచ్చి తన తల్లి ఇంకా స్కూల్ టీచర్‌గా కష్టపడుతుందని, ప్రస్తుతం తనకంటూ ఏ ఆదాయం లేకపోవడంతో తన తల్లే కష్టపడి ఇంటికి నడిపిస్తుందని, అందుకే ఈ క్యాష్ ప్రైజ్ వస్తే డబ్బులన్నీ తన తల్లి అకౌంట్లో వేసి తనను రిటైర్ చేయిస్తానని తెలిపాడు. ఆ తర్వాత ప్రియాంక.. ఇంకా తన తల్లిదండ్రుల పేరు మీద కానీ, తన పేరు మీద కానీ ఎలాంటి ప్రాపర్టీ లేదని, అందుకే తన తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లు కొంటానని చెప్పింది. ఇక అమర్‌దీప్ కూడా తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉందని అన్నాడు. అయితే తన సొంతూరు అనంతపురంలో ఒక ఇల్లు ఉన్నా కూడా హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నానని, దానికోసం క్యాష్ ప్రైజ్‌ను ఉపయోగిస్తానని అన్నాడు. శోభా కూడా బెంగుళూరులో తన తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లు కట్టానని, క్యాష్ ప్రైజ్‌తో ఆ ఇంటికి చేసిన అప్పు తీరుస్తానని తెలిపింది.


రైతుల కోసమే..
ఇక యావర్.. బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టినప్పటి నుండే తనకంటూ ఆర్థిక కష్టాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అయితే తాను విన్నర్ అయ్యి.. ఈ క్యాష్ ప్రైజ్ తనకు వస్తే తన అన్నకు బిజినెస్ పెట్టుకోవడానికి ఇస్తానని, తమ్ముడికి ఆర్థిక సాయం చేస్తానని, అంతే కాకుండా తక్కువ ఖర్చులో ఒక అపార్ట్‌మెంట్ కూడా చూసి పెట్టానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. అంతే కాకుండా క్యాష్ ప్రైజ్‌గా వచ్చే రూ.50 లక్షలు కూడా తన అప్పులు, కష్టాలు తీర్చడానికి సరిపోవు. కానీ ఎంతోకొంత సాయంగా ఉంటాయని అన్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో కామన్ మ్యాన్‌గా, రైతుబిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అయితే తను ముందు నుంచి చెప్పిన మాట మీదే నిలబడతానని అన్నాడు. తనకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసుకోనని, పంట పండించడానికి కష్టపడి అప్పులు చేసి, చివరికి అప్పులు తీర్చలేక చనిపోయి రైతు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తాను బిగ్ బాస్‌లోకి డబ్బు కోసం రాలేదని, గుర్తింపు కోసం వచ్చానని మరోసారి గుర్తుచేశాడు.


అప్పుడే చెప్తాను..
ఇక అర్జున్‌కు ఆ క్యాష్ ప్రైజ్ వస్తే.. తనకు పుట్టబోయే బిడ్డకు ఆర్థికంగా సెక్యూరిటీని అందిస్తానని అన్నాడు. మేనకోడలుకు కూడా మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. పైగా తను ఎల్లప్పుడూ పలు చారిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటానని, తన క్యాష్ ప్రైజ్‌లో నుంచి కొంత అమౌంట్.. ఆ చారిటీలకు కూడా వెళ్తుందని బయటపెట్టాడు. అందరు తమ తమ కలలను, ఆశలను బయటపెడితే శివాజీ మాత్రం ఆ క్యాష్ ప్రైజ్‌తో ఏం చేస్తాడు అనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడలేదు. అందరికీ డబ్బు అవసరమే అని, అందరికీ క్యాష్ ప్రైజ్ రావాలని ఉంటుంది, అలాగే తనకు కూడా రావాలనే ఉందని, ఒకవేళ క్యాష్ ప్రైజ్ గెలిస్తే.. అప్పుడు ఆ డబ్బుతో ఏం చేస్తానో చెప్తానని శివాజీ అన్నాడు.


Also Read: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply