బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి నామినేషన్సే చాలా పోటాపోటీగా జరిగాయి. ప్రతీ సీజన్‌లాగానే ఈ సీజన్‌లో కూడా కొందరు కంటెస్టెంట్స్ చాలా సిల్లీ కారణాలు చెప్పి ఇతర కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేశారు. ఒకవేళ ఆ కారణాలు అంత బలంగా అనిపించకపోతే.. బిగ్ బాస్ సైతం వారిని అభిప్రాయం మార్చుకోమన్నారు. అయినా కూడా కంటెస్టెంట్స్ తమ మాటే కరెక్ట్ అన్నట్టుగా నచ్చనివారిని నామినేట్ చేసుకుంటూ పోయారు. అలా రెండు రోజులు ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్ పూర్తయ్యే సమయానికి 8 మంది కంటెస్టెంట్స్.. ఈ లిస్ట్‌లో ఉన్నారు. 


బిగ్ బాస్ 7 మొదటి నామినేషన్స్‌లో ఉన్నది వీరే..
శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని భట్ల.. వీరందరూ బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్ లిస్ట్‌లో ఉన్నారు. ముందుగా అలనాటి నటి కిరణ్ రాథోడ్‌కు భాష రాదనే కారణంతో తనను చాలామంది నామినేట్ చేశారు. బిగ్ బాస్ అనేది తెలుగు షో కాబట్టి అందులో భాష రాకుండా తను ఇబ్బంది పడుతుందని కొందరు, ఇతరులను ఇబ్బంది పెడుతుందని మరికొందరు నామినేట్ చేశారు. దానికి కిరణ్ రాథోడ్ కూడా కొంచెం ఫీల్ అయినా వారి కారణాలు కూడా నిజమే కాబట్టి ఎవరితో పెద్దగా వాదించడానికి ఆసక్తి చూపించలేదు. తనతో పాటు మరో సీనియర్ నటి షకీలా ప్రవర్తన కూడా హౌజ్‌లోని కొంతమంది కంటెస్టెంట్స్‌కు నచ్చలేదు. దీంతో తను కూడా నామినేషన్స్‌లో ఉండక తప్పలేదు.


శోభా శెట్టిదే డామినేషన్..
సీరియల్‌లో విలన్‌గా విపరీతమైన గుర్తింపు అందుకున్న శోభా శెట్టి.. బిగ్ బాస్ హౌజ్‌లో కూడా ముందు నుండే విలన్ లక్షణాలు కనబరుస్తోంది. గౌతమ్ కృష్ణను నామినేట్ చేసిన తర్వాత అతడితో వాగ్వాదానికి దిగింది. దామిని.. తనను నామినేట్ చేసిందని.. వెళ్లి తనతో కూడా గొడవపెట్టుకుంది. అంతే కాకుండా గొడవ పెట్టుకున్న తర్వాత గార్డెన్‌లో కూర్చొని కంటెస్టెంట్స్ ముందు ఏడవడం, కెమెరా ముందుకు వచ్చి ప్రేక్షకుల ముందు ఏడవడం.. ఇవన్నీ తనపై జాలి క్రియేట్ చేసుకోవడానికి చేస్తుందా అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 మొదటి నామినేషన్స్‌లో డామినేషన్ ఎక్కువగా శోభా శెట్టిదే కనిపిస్తోంది.


సాయం చేయడం లేదనే కారణంతో..
బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్ సమయంలో రతిక చాలా యాక్టివ్‌గా అనిపించింది. దాదాపుగా చాలామంది కంటెస్టెంట్స్‌తో బాగానే మాట్లాడినట్టుగా కూడా అనిపించింది. కానీ రతిక హౌజ్‌లో సరిగా పనిచేయడం లేదు అన్న కారణంతోనే ఎక్కువమంది చేత నామినేట్ చేయించుకుంది. ప్రిన్స్ యావర్ సైతం ఎవరితో కలవడం లేదని, ఎందులోనూ పెద్దగా సాయం చేయడానికి ముందుకు రావడం లేదనే కారణాలతోనే నామినేషన్స్‌లో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ ప్రవర్తన, మాటతీరు నచ్చని కొందరు తనను కూడా నామినేషన్స్‌లో నిలబెట్టారు. గౌతమ్ కృష్ణ.. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన మొదటిరోజుకే గ్రూప్స్ ఫార్మ్ చేయడంతో తనపై కంటెస్టెంట్స్‌లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతోంది. ఇక దామిని కూడా ఎక్కువగా ఎవరితో కలవకుండా, కిచెన్‌లోనే ఉండడంతో కొందరు తనను నామినేట్ చేశారు.


Also Read: ‘జైలర్’ సీక్వెల్‌లో బాలకృష్ణ? రజినీకాంత్ రీల్ కొడుకు వసంత్ రవి చెప్పిన సమాధానం ఇదీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial