సండే ఎపిసోడ్‌లో ఫ్రెండ్స్ అంటూ హగ్ చేసుకున్నవాళ్లే.. ఈరోజు నామినేషన్స్‌లో మళ్లీ గొడవలు పడడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ సీజన్ 7 మొదలయినప్పటి నుండి కొందరు కంటెస్టెంట్స్.. కొందరిని మాత్రమే నామినేట్ చేస్తూ వస్తున్నారు. ఫైనల్స్ దగ్గరపడుతున్నా కూడా వారు ఈ అలవాటును మాత్రం మార్చుకోలేదు. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో కూడా మరోసారి అదే జరిగిందని తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. సీరియస్ నామినేషన్స్‌లో కూడా కామెడీ చేసి నవ్వించే ప్రయత్నం చేశాడు పల్లవి ప్రశాంత్. చివరిగా ఒక పవర్‌ఫుల్ డైలాగ్ కూడా చెప్పాడు. 


సింహంతో పోల్చుకున్న ప్రశాంత్..
ఈ ప్రోమోలో ముందుగా రతిక.. తన నామినేషన్స్‌ను చెప్పడానికి లేచింది. తను నామినేట్ చేయాలనుకుంటున్న ప్రశాంత్‌ను రమ్మని పిలిచింది. నామినేషన్స్‌లో వీరి కెమిస్ట్రీ చూసి కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు. ఆ తర్వాత వెంటనే రతిక చెప్పిన కారణానికి ప్రశాంత్.. డిఫెండ్ చేయడం మొదలుపెట్టాడు. ‘‘చూసిన నీకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది నీకు. అది నీ తప్పు నా తప్పు కాదు’’ అని రతికకు వివరించే ప్రయత్నం చేశాడు. దానికి రతిక కూల్‌గా.. ‘‘నీది అయిపోతే నేను మాట్లాడతా’’ అని సమాధానమిచ్చింది. రతిక.. ప్రశాంత్‌ను నామినేట్ చేసిన తర్వాత ప్రశాంత్ కూడా రతికనే రివర్స్ నామినేట్ చేసినట్టు ప్రోమోలో తెలుస్తోంది. ఆ సమయంలో రతిక.. తతను తాను డిఫెండ్ చేసుకుంది. ‘‘పల్లవి ప్రశాంత్ ఎన్ని ఇటుకలు సేకరించాడు? అర్జున్ ఎన్ని ఇటుకలు సేకరించాడు? పల్లవి ప్రశాంత్ యొక్క ఆలోచనా మేధావి శక్తి ఇది’’ అని రతిక స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘‘అక్క సింహానికి ఆకలి ఎక్కువ. పల్లవి ప్రశాంత్‌కు పవర్ ఎక్కువ. సింహం ఆకలి కోసం వేటాడుతుంది. పల్లవి ప్రశాంత్ ఆకలి కోసం ఆట ఆడతాడు’’ అంటూ చివర్లో డైలాగ్ కొట్టాడు ప్రశాంత్. తను ఆ డైలాగ్ చెప్పగానే ‘‘కట్.. బాగుంది డైలాగ్’’ అంటూ రతిక వ్యంగ్యంగా ప్రశంసించింది.


నామినేషన్స్‌లో అమర్ కామెడీ..
పల్లవి ప్రశాంత్‌తో పాటు అమర్‌దీప్‌ను కూడా నామినేట్ చేసింది రతిక. కానీ రతిక నామినేషన్స్‌ను అమర్ సీరియస్‌గా తీసుకోలేదు. ‘‘15వ వారంలో ఎంతమంది ఉంటారు?’’ అని రతిక ప్రశ్నించగా.. తెలియదు అంటూ తేలిగ్గా సమాధానమిచ్చాడు. ‘‘నీకేదీ తెలీదు. చెప్తున్నా విను’’ అని రతిక అంటుండగానే.. అక్కడ ఉన్న సింహం బొమ్మ మీసాలు దువ్వడం మొదలుపెట్టాడు అమర్. అది గమనిస్తున్న రతిక.. ‘‘కౌంట్ చేయ్ ఎన్ని ఉన్నాయో’’ అని అనగానే.. చేశాను అన్నాడు. ‘‘మళ్లీ ఇది రిపీట్ అవ్వొద్దు’’ అని రతిక చెప్తున్నా కూడా అమర్ పట్టించుకోలేదు. 


గౌతమ్, ప్రశాంత్‌ల పంచె పంచాయతీ..
ఆ తర్వాత నామినేషన్స్ విషయంలో గౌతమ్‌కు, పల్లవి ప్రశాంత్‌కు మధ్య మళ్లీ గొడవ మొదలయ్యింది. ముందుగా గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రశాంత్ చెప్పాడు. ‘‘నాకు నువ్వు వేసిన నామినేషన్‌లో ఏం పాయింట్ కనిపించలేదు. సేఫ్‌గా ఆడావు’’ అని ఆరోపించాడు ప్రశాంత్. ‘‘నా పంచె ఆనవాయితీలాగా నీకు కూడా అది ఆనవాయితీ’’ అని కామెడీగా అన్నాడు గౌతమ్. ‘‘ఆ పంచె ఊడిపోకుండా కాపాడుకో’’ అని కూల్‌గా వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్. అది విన్న గౌతమ్.. ఎక్కువ, తక్కువ మాట్లాడకు అని అరవడం మొదలుపెట్టాడు. అయినా కూడా బరాబర్ మాట్లాడతా అంటూ సమాధానమిచ్చాడు ప్రశాంత్. ‘‘పంచె అనేది తెలుగోడి సంస్కృతి. దాని గురించి నువ్వు మాట్లాడితే మంచిది కాదు’’ అన్నాడు గౌతమ్.  ఆ తర్వాత ‘‘నువ్వు అలా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను’’ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. మాట్లాడకు అంటూ ప్రశాంత్ కూడా లైట్ తీసుకున్నాడు.



Also Read: నన్ను మాట్లాడనివ్వరా - నామినేషన్స్‌లో శివాజీపై ప్రశాంత్ సీరియస్, కౌంటర్ ఇచ్చిన రతిక