బిగ్ బాస్ రియాలిటీ షో అనేది సాధారణంగా చాలా కాంట్రవర్సీలకు, విమర్శలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. కానీ అవన్నీ దాటి.. మొదటిసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై దాడి జరిగింది. కంటెస్టెంట్స్ కార్ల అద్దాలు పగిలిపోయేంతలాగా ఆకతాయిలు.. వారిపై దాడి చేశారు. కానీ పల్లవి ప్రశాంత్‌కు గానీ, తన కారుకు గానీ ఏం కాలేదు. అయినా ఎంత చెప్పినా వినకుండా పల్లవి ప్రశాంత్.. శాంతిభద్రతలను పట్టించుకోకుండా ప్రవర్తించాడని పోలీసులు తనపై కేసు పెట్టారు. దీంతో రైతుబిడ్డ పరారీలో ఉన్నాడని వార్తలు ప్రసారమవుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం కోసం ప్రశాంత్ ఒక వీడియోను విడుదల చేశాడు.


పోలీసులతో రైతుబిడ్డ వాగ్వాదం..
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని ఫిక్స్ అయిన కొందరు ఫ్యాన్స్.. తనకోసం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు వచ్చారు. వారంతా చాలాసేపు స్టూడియోస్ బయట ఎదురుచూడడంతో అసహనానికి లోనయ్యారు. అందుకే కంటెస్టెంట్స్ బయటికి వచ్చే సమయానికి వారిని చూడడానికి కార్ల వెంట పరిగెత్తారు. వారు పట్టించుకోకుండా కార్లలో వెళ్లిపోతుండడంతో కోపం వచ్చిన కొందరు ఆకతాయిలు.. వారి కార్లపై దాడి చేశారు. చివరిగా వచ్చిన పల్లవి ప్రశాంత్‌కు అలా జరగకూడదని పోలీసులు.. తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారిపై సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయిన ప్రశాంత్.. మళ్లీ స్టూడియోస్ దగ్గరకు తిరిగొచ్చాడు.


ఏ1గా పల్లవి ప్రశాంత్..
పోలీసులు ఎంత చెప్తున్నా వినకుండా ఫ్యాన్స్‌ను కలవాలని చెప్పడంతో పల్లవి ప్రశాంత్‌కు, పోలీసులకు గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదయ్యింది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందులో ఏ1గా పల్లవి ప్రశాంత్ పేరును నమోతు చేశారు. ఏ4, ఏ5లుగా కార్ల డ్రైవర్ల పేర్లను నమోదు చేసి.. వారిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకున్నారు. కానీ పల్లవి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకోవాలని అనుకున్నా.. తను పరారీలో ఉన్నాడని, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతలోనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్.


ప్రశాంత్ వీడియో ప్రూఫ్..
పల్లవి ప్రశాంత్ తన స్నేహితులతో, ఊరివారితో కలిసి ఒక వీడియోను విడుదల చేశాడు. ముందుగా తన ఫేమస్ డైలాగ్.. మళ్లొచ్చినా.. తగ్గేదే లే అని చెప్పిన తర్వాత.. ‘‘అన్నా నేను ఎక్కడికి పోలేదు. అన్నీ తప్పుడు సమాచారాలు. నేను ఇంటి దగ్గరే ఉన్నా..’’ అని రివీల్ చేశాడు ప్రశాంత్. ఫాలోవర్స్.. తన మాట నమ్మరేమో అని తన స్నేహితులతో కూడా తను ఇంటి దగ్గరే ఉన్న విషయాన్ని చెప్పించాడు. ఆ వీడియోలో తనతో పాటు ఉన్నవారందరూ ప్రశాంత్.. ఊరిలోనే ఉన్నాడని, తన ఇంట్లోనే ఉన్నాడని చెప్పుకొచ్చారు. మరి ప్రశాంత్ ఇంట్లోనే ఉండగా.. తప్పుడు ప్రచారం ఎలా మొదలయ్యింది, పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోకుండా, తప్పుడు ప్రచారంపై రియాక్ట్ అవ్వకుండా సైలెంట్‌గా ఉంటున్నారు అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.






Also Read: నాకేమైనా పర్లేదు, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వస్తాను - అమర్ ఎమోషనల్ వీడియో