రికొద్ది సేపట్లో ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అడుగుపెట్టబోతుంది అనగా ఆమెకు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. అంతే, ఆ వార్త వినగానే ఆమె గుండె పగిలింది. వెంటనే ‘బిగ్ బాస్’ ఛాన్సును వదులుకుంది. ఆమె మరెవ్వరో కాదు.. ‘గుండమ్మ కథ’ సీరియల్ నటి పూజా మూర్తి. అయితేనేం.. మళ్లీ ఆమె ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చింది. ‘బిగ్ బాస్’ సీజన్-7.. 2.0తో మరోసారి అవకాశం వచ్చింది. తన తండ్రి చెప్పిన చివరి మాటలను నిజం చేయడం కోసం ఆమె కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తానని పేర్కొంది. లావుగా తాను మొదట్లో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని, కానీ.. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు సాగించి, సీరియల్ హీరోయిన్‌గా అవకాశం పొందానని పూజా మూర్తి ఈ సందర్భంగా వెల్లడించింది.


నాన్న ఇక్కడ చూడాలనుకున్నారు: పూజా మూర్తి


పూజా మూర్తి ఎంట్రీ కోసం ఏవీ కూడా సిద్ధమైపోయింది. వేదికపై డ్యాన్స్ చేసేందుకు ఆమె ప్రాక్టీస్ చేసింది. ఇంతలో ఆమె తండ్రి చనిపోయారనే వార్త వచ్చింది. గుండె సమస్యతో ఆయన అకాలమరణం చెందారనే వార్త తెలియగానే.. ఆమె తన స్వగ్రామానికి బయల్దేరి వెళ్లిపోయింది. అలా.. ‘బిగ్ బాస్’ అవకాశాన్ని కోల్పోయింది. అయితే, ఉల్టాపుల్టాలో భాగంగా ఆమెకు 2.0లో అవకాశం వచ్చింది. నయని పావని, అశ్విని, అంబాటి అర్జున్, బోలే శ్రావలితో కలిసి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జునతో మాట్లాడుతూ.. ‘‘నేను బిగ్ బాస్‌కు వెళ్తున్నానని తెలియగానే నాన్న చాలా సంతోషించారు. నువ్వు వెళ్లు మేం టీవీలో చూస్తామని అన్నారు. కొన్ని గంటల్లో బిగ్ బాస్ అనగా నాన్నకు అలా అయ్యిందనే వార్త వచ్చింది’’ అని భావోద్వేగానికి గురైంది. అయితే, తాను ఆత్మవిశ్వాసంతో మళ్లీ ఇక్కడికి వచ్చానని, ఆయన చనిపోయి నెల రోజులు అవుతుందని, మరిచిపోవడం అంత ఈజీ కాదని అన్నారు. అయితే, నాన్న తనను ‘బిగ్ బాస్’ హౌస్‌లో చూడాలని అనుకున్నారని, అందుకే హౌస్‌లోకి అడుగుపెట్టి.. ఆయన మాటను నెరవేర్చడానికి వచ్చానని పూజా పేర్కొంది. అనంతరం ఆమె తండ్రి ఎంతో ఇష్టంగా వండే పూజా ఫేవరెట్ కర్రీ పుదినా చికెన్ కర్రీతో నాగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 


క్షమించు నాన్నా అంటూ పూజా మూర్తి ఆవేదన!


తండ్రి మరణం తర్వాత పూజా సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తం చేసింది. వీలైతే తిరిగి వచ్చేయండి నాన్నా అంటూ బతిమలాడుకుంది. 'RIP.. వీలైతే తిరిగి రండి. నిన్ను ఎంతో ప్రేమించాను నాన్నా. ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతున్నాను. నాకు తెలిసినంత వరకు నిన్ను గర్వపడేలా చేశాను అని అనుకుంటున్నాను. తెలిసో, తెలియకో ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించు నాన్నా. నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆశీస్సులు నాకు, అమ్మకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఈ మేరకు తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.   
బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్న పూజ


పూజా మూర్తి కన్నడ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘గుండమ్మ కథ’తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అటు యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించిన ‘సూపర్ క్వీన్’ షోలో పాల్గొంది. చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి 5వ కంటెస్టెంట్‌గా శుభశ్రీ ఎలిమినేట్ అయ్యింది. గౌతమ్‌ను నాగ్.. సీక్రెట్ రూమ్‌కు పంపించారు. మరి, బయట నుంచి అన్నీ చూసిన కొత్తవారిని ఎదుర్కోవడమంటే.. పాత కంటెస్టెంట్స్‌కు కాస్త కష్టమే.