బిగ్ బాస్ (Bigg Boss Telugu 7) రియాలిటీ షో కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమే అని కొందరు ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోతున్నారు. తాజాగా ఫ్యాన్స్ ప్రవర్తన మరీ శృతిమించిపోయింది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ అయిపోయిన వెంటనే కార్లపై దాడి చేసి.. పోలీసులు వారిపై కేసు నమోదు చేసేవరకు వెళ్లారు. దీంతో అసలు బిగ్ బాస్ అనే రియాలిటీ షోనే ఇంక ఉండొద్దని హైకోర్డు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు.


ప్రేక్షకులపై చెడు ప్రభావం..
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో మొదటి సీజన్ జరుపుకుంటున్న సమయంలోనే ఈ షో.. సమాజానికి మంచిది కాదని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో ఇక సీజన్స్ జరగకూడదని ఖండించారు. కానీ అలా జరగలేదు.. ఒకటి తర్వాత ఒకటిగా సీజన్స్ పూర్తి చేసుకుంటూ.. తెలుగు బిగ్ బాస్ ఏడవ సీజన్‌కు చేరుకుంది. కానీ సీజన్ 7 ఫైనల్స్ సమయంలో జరిగిన సంఘటనపై పలువురు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. వెంటనే ఈ షోను బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా హైకోర్టు న్యాయవాది అరుణ్.. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)కి ఫిర్యాదు కూడా చేశారు. రెండు పేజీల ఫిర్యాదు లేఖను రాసి వారికి అందించారు. అందులో బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన చెడు ప్రభావం చూపిస్తుందని తెలిపారు.


నాగార్జునను అరెస్ట్ చేయాలి..
బిగ్ బాస్ ఫైనల్స్ రోజు జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అవ్వగా.. అందులో ఎక్కడా నాగార్జున పేరు లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు అరుణ్. అందుకే ఆయన పేరును కూడా చేర్చాలని, ఆ గొడవకు ఆయన కూడా బాధ్యులే అని కోరారు. బిగ్ బాస్ నిర్వహకులు కూడా గొడవ జరిగేంతలాగా నిర్లక్ష్యం వహించారని అన్నారు. ఆరు ఆర్టీసీ బస్సులు, పలు కార్లు ధ్వంసం అయ్యాయని గుర్తుచేశారు. ఇప్పటికీ ఇదే విషయంపై హైకోర్టుకు కూడా లేఖ రాశానని, నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఇప్పటికే బిగ్ బాస్‌పై ఇలాంటి ఫిర్యాదులు ఎన్ని వచ్చినా.. ఆ షో మాత్రం ఆగలేదు. ఈసారి గొడవ సీరియస్ అయ్యింది కాబట్టి ఇప్పటికైనా ఈ షో బ్యాన్‌పై చర్యలు జరుగుతాయేమో అని హేటర్స్ కోరుకుంటున్నారు.


రెండు కేసులు నమోదు..
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న అశ్విని శ్రీ, అమర్‌దీప్ కార్లపై మాత్రమే కాకుండా.. బిగ్ బాస్ బజ్‌లో యాంకర్‌గా చేస్తున్న మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్‌ కారుపై కూడా దాడులు జరిగాయి. వారి కార్ల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిపై గీతూ సీరియస్ అవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. అయినా కూడా ఆకతాయిలు ఆగకుండా.. ఆరు ఆర్టీసీ బస్సులు, పోలీస్ కారుపై కూడా దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సెక్షన్స్ 147, 148, 290, 353, 427 r/w, 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు నమోదయ్యాయి. మొత్తం రెండు కేసుల్లోని ఒక కేసులో ఏ1గా పల్లవి ప్రశాంత్ పేరును పోలీసులు నమోదు చేసుకున్నారు.


Also Read: పరారీలో పల్లవి ప్రశాంత్ - క్లారిటీ ఇచ్చిన రైతు బిడ్డ