‘బిగ్ బాస్’ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ కోసం గత కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ అంతా ‘బిగ్ బాస్’ మారథాన్‌లో పాల్గొని వివిధ టాస్కుల్లో తమ లక్ పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన ‘బిగ్ బాస్’ మారథన్‌లో కంటెస్టెంట్లు అంతా పోటీపడ్డారు. చివరికి ప్రియాంక, పల్లవి ప్రశాంత్, గౌతమ్, శోభాశెట్టి, సందీప్‌లు టాస్కుల్లో గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో డాక్టర్ బాబు గౌతమ్ విజేతగా నిలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు తెలిసింది. 


కెప్టెన్సీ కోసం శివాజీతో మాటలు కలిపిన శోభా


దుస్తులు ధరించే టాస్క్‌లో శోభా విజేతగా నిలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా ఎంపికైంది. అప్పటి నుంచే పావులు కదపడం మొదలుపెట్టింది. ఒక వేళ బిగ్ బాస్.. హౌస్‌మేట్స్ ఎంపిక చేసిన వ్యక్తే కెప్టెన్ అవుతారనే ట్విస్ట్ పెడితే.. తనకు ఎవరూ మద్దతు ఇవ్వరనే భయం శోభాలో నెలకొంది. దీంతో అశ్వినీ శ్రీతో కాసేపు కబుర్లు పెట్టి.. తన గురించి చెప్పుకొచ్చింది. షవర్ టాస్క్‌‌లో నిన్ను ఎంకరేజ్ చేసింది నేనే అని తెలిపింది. వాస్తవానికి ఆమె సందీప్ మాస్టర్‌ను ప్రోత్సహించింది. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఎప్పుడూ శివాజీకి దూరంగా ఉండే శోభా.. ఈ సారి ఆయనతోనే సిట్టింగ్ వేసి కబుర్లు చెప్పింది. ఒక వేళ కెప్టెన్‌గా అర్హులు ఎవరని అడిగితే తనకు మద్దతు ఇవ్వాలని అడిగింది. అయితే, కంటెండర్స్‌లో పల్లవి ప్రశాంత్ కూడా ఉండటంతో శివాజీ ఆచితూచి స్పందించారు. ఆమె వెళ్లిపోగానే తన బ్యాచ్‌తో మీటింగ్ పెట్టిన శివాజీ.. ఆమెకు కెప్టెన్సీ భయం పట్టుకుందని తెలిపాడు. ఇలా శోభాశెట్టి.. రాజకీయ నేతలు ఓట్ల కోసం తిరిగినట్లుగా.. హౌస్‌మేట్స్ అందరినీ మంచి చేసుకొనే ప్రయత్నాలు చేసింది. పైగా ఈ వారం ఆమె నామినేషన్స్‌లో ఉండటంతో.. ఆమె టెన్షన్‌గా గడుపుతోంది. అయితే, కెప్టెన్సీ కంటెడర్‌షిప్‌ రావడంతో ఆమెకు కాస్త ఓదార్పు లభించింది. 


కెప్టెన్‌గా డాక్టర్ బాబు గౌతమ్?


కెప్టెన్సీ కంటెండర్‌గా ఎంపికైన ప్రియాంక, పల్లవి ప్రశాంత్, గౌతమ్, శోభాశెట్టి, సందీప్‌ల్లో ఎవరు కెప్టెన్ అవుతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే, వీరిలో ఈసారి శోభాశెట్టి, ప్రియాంక లేదా పల్లవి ప్రశాంత్‌లకే కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయని అంతా భావించారు. అయితే, ఎవరూ ఊహించని వ్యక్తి ఈ సారి బిగ్ బాస్‌ హౌస్‌కు కెప్టెన్ అయినట్లు సమాచారం. అతడు మరెవ్వరో కాదు.. డాక్టర్ బాబు గౌతమ్. ఇంట్లో గ్రూపిజానికి దూరంగా ఉంటూ అందరితో కలిసిపోతూ.. సరదాగా ఉంటూ.. ఇతరులకు సాయం చేస్తూ సాగిపోతున్నాడు గౌతమ్. అందుకే, అతడు కెప్టెన్‌గా ఛాన్స్ కొట్టేసి ఉండవచ్చని తెలుస్తోంది. 


రతికాకు చుక్కలు చూపించిన పల్లవి ప్రశాంత్


పల్లవి ప్రశాంత్‌తో పాత గొడవలను పరిష్కరించుకుని మళ్లీ స్నేహం చేయడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది రతిక. ఇందులో భాగంగా ఆమె యావర్ సాయంతో.. ప్రశాంత్‌తో మాట్లాడింది. అయితే, ప్రశాంత్ ఆమె మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. తనను ఆమె ఏవిధంగా బాధపెట్టిందనే విషయాలను దాచుకోకుండా చెప్పేశాడు. ఒకరకంగా ఇది రతికాకు మైనస్. ఎందుకంటే.. పల్లవి ప్రశాంత్ అడిగిన ప్రశ్నలకు రతికా దగ్గర సమాధానం లేదు. నువ్వు నన్ను అక్క అని పిలవడం నచ్చలేదు నన్ను రతిక అని పిలువాలని ఆమె పేర్కొంది. బయటకు వెళ్లాక నీ ఇష్టం.. కానీ హౌస్‌లో ఉన్నప్పుడైనా ఫ్రెండ్లీగా ఉండని ప్రశాంత్‌ను కోరింది. నువ్వు ఆ రోజు మా అమ్మ, నాన్నను మాటలు అన్నావని, అదే మనసులో ఉండిపోయిందని ఏడ్చాడు. దీంతో రతిక స్పందిస్తూ.. నేను ఆ ఇంటెన్షన్‌తో అనలేదని, ఆ రోజు అమర్‌దీప్ వల్లే అలా అనాల్సి వచ్చిందని రతిక పేర్కొంది.    దీంతో ప్రశాంత్.. ‘‘నా ఆట నేను ఆడుకోవాలి.. నా మైండ్ కరాబ్ అవుతుంది. నా వల్ల ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే క్షమించు అక్కా’’ అని తెలిపాడు. ఆ తర్వాత శివాజీ ఇద్దరికీ రాజీ కుదిర్చాడు. ఆడబిడ్డ అంతగా అడుగుతున్నప్పుడు మన్నించాలి అని తెలపడంతో ప్రశాంత్ కూల్ అయ్యాడు.