బుల్లితెరపై బిగ్ బాస్(Bigg Boss Telugu) షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ ఓటీటీ(Bigg Boss Telugu OTT) వెర్షన్ ను మొదలుపెట్టబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఇలా ప్లాన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి 24/7 ఈ షో హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఈ షో కొత్త ఎక్స్ పీరియన్స్ ను కలిగిస్తుందని చెబుతున్నారు. 


తాజాగా ఈ షోకి సంబంధించిన లోగోను విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. 'బ్లూ కలర్ ఐ'తో ఉన్న లోగో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 24/7 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని పోస్టర్ పై రాసి ఉంది. తెలుగు ఆడియన్స్ కి మరో లెవెల్ లో ఎంటర్టైన్మెంట్ పంచబోతున్నామని బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. అంటే ఈసారి ఫన్ మాములుగా ఉండదన్నమాట. 


ఫిబ్రవరి 26 నుంచి షో మొదలుకానుందని టాక్. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక ఈ షోలో ఒకప్పటి కంటెస్టెంట్స్ కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు టీవీలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్ల నుంచి కొందరు కంటెస్టెంట్స్ ను ఓటీటీ వెర్షన్ కోసం తీసుకున్నారని సమాచారం. తేజస్వి, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలానే నటుడు తనీష్ కూడా కనిపించబోతున్నాడని సమాచారం. సింగర్స్ కేటగిరీలో హేమచంద్ర ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈసారి సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్స్ చాలా మంది కనిపిస్తారట. కంటెస్టెంట్ లిస్ట్ ఫైనల్ అయిందని త్వరలోనే వారిని క్వారెంటైన్ లో పెట్టబోతున్నారని తెలుస్తోంది.