బిగ్ బాస్ రియాలిటీ షోకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు కాబట్టి అందులో ఉండే కంటెస్టెంట్స్ వెంటనే ఫ్రెండ్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన రెండురోజు నుండే గ్రూప్స్ ఫార్మ్ అయిపోతాయి. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో కూడా అలాంటి గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఒకటి రతిక, పల్లవి ప్రశాంత్, శివాజీ గ్రూప్. మెల్లగా ఈ గ్రూప్‌లోకి ప్రిన్స్ యావర్ కూడా జాయిన్ అయ్యాడు. అయితే తాజాగా ఈ గ్రూప్ నుంచి రతిక ఎలిమినేట్ అయిపోయింది. దీంతో శివాజీ, పల్లవి ప్రశాంత్ కలిసి రతికను గుర్తుచేసుకున్నారు. అలా తనను గుర్తుచేసుకుంటూ వారు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని రతిక.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.


పల్లవి ప్రశాంత్‌తో గొడవలు


బిగ్ బాస్ హౌజ్‌లో శివాజీ ఎక్కడ ఉంటే పల్లవి ప్రశాంత్ అక్కడ ఉంటాడు. ఇక వీరిద్దరూ ఎక్కడ ఉంటే రతిక అక్కడ ఉంటుంది. ఈ ముగ్గురు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభంలోనే ఒక గ్యాంగ్ అయిపోయారు. అయితే పల్లవి ప్రశాంత్‌తో రతికకు మనస్పర్థలు మొదలయ్యాయి. సరిగా మాట్లాడుకోవడం కూడా మానేశారు. కానీ రతిక మాత్రం సంబంధం లేకపోయినా అప్పుడప్పుడు పల్లవి ప్రశాంత్‌తో గొడవలు పెట్టుకోవాలని చూసేది. దీంతో రతికపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరిగిపోయింది. ప్రశాంత్, రతిక మాట్లాడుకోకపోయినా.. శివాజీ, రతిక మాత్రం బాగానే ఉండేవారు. రతికను ఎప్పుడూ బిడ్డ అని పిలుస్తూ సపోర్ట్ చేసేవాడు శివాజీ. కానీ ఒక సంఘటన వల్ల వీళ్ల మధ్య బాండింగ్ కూడా తగ్గిపోయింది.


శివాజీతో తగ్గిపోయిన బాండింగ్


పల్లవి ప్రశాంత్ విషయంలో రతికది కూడా తప్పు ఉంది అనే విధంగా శివాజీ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం రతికకు నచ్చలేదు. శివాజీని నిలదీసింది. అప్పటినుంచి వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలా రతిక.. బిగ్ బాస్ హౌజ్‌లో ఎవరితో అయితే ఫ్రెండ్‌షిప్ చేసిందో.. హౌజ్‌ను వదిలి వెళ్లిపోయే ముందు వారినే దూరం చేసుకుంది. రతిక ఎలిమినేషన్ సమయంలో శివాజీ, ప్రశాంత్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తను వెళ్లిపోయిన తర్వాత మాత్రం తనను గుర్తుచేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రతిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


శివాజీ, ప్రశాంత్ సంభాషణ


ముందుగా ప్రశాంత్.. శివాజీతో ‘‘రతిక గుర్తొస్తుంది. రాత్రి తెగ గుర్తొచ్చింది. నిద్ర పట్టలేదు’’ అంటూ రతిక గురించి డిస్కషన్ మొదలుపెట్టాడు. ‘‘నాకు గుర్తొచ్చింది కానీ ఏం చేస్తాం రా చిన్నపిల్ల’’ అని సమాధానమిస్తాడు శివాజీ. ‘‘అది చిన్న పిల్ల ఏంది బర్రె పిల్ల. చాలా కోపమొస్తుంది’’ అన్నాడు ప్రశాంత్. ‘‘బయటికి వెళ్లాక కలుద్దాంలే. నువ్వు బాధపడకు. నాకు అర్థమయ్యింది నీ బాధ’’ అంటూ ప్రశాంత్‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు శివాజీ. ‘‘రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా దాన్ని. నా మీద ఎందుకు కోపం. నేనేం చేశా. నామినేషన్ చేసినా కూడా మన అమ్మాయే కదా అని మాట్లాడినా నన్ను నమ్మలేదు’’ అంటూ తన బాధనంతా బయటపెట్టాడు ప్రశాంత్. అయినా కూడా శివాజీ.. ప్రశాంత్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ‘‘చిన్న పిల్లరా వదిలేయ్’’ అన్నాడు. ‘‘నన్ను కలవదు బయటికి వెళ్లాక’’ అంటూ ప్రశాంత్ బాధపడ్డాడు. ఈ సంభాషణ మొత్తం తన సోషల్ మీడియాలో షేర్ చేసిన రతిక.. ‘సో స్వీట్.. నేను కూడా వారిద్దరినీ మిస్ అవుతున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది.




Also Read: ఈ ఆదివారం ‘బిగ్ బాస్’లో అదిరిపోయే ట్విస్ట్, ఆ నలుగురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ? కంటెస్టెంట్లకు షాక్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial