బిగ్ బాస్ రియాలిటీ షోలో సండేను ఫన్‌డే అంటారు నాగార్జున. కానీ బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రమే మండేనే ఫన్‌డే అంటారు. ఎందుకంటే ఆరోజే నామినేషన్స్ జరుగుతాయి. అసలు బిగ్ బాస్ రియాలిటీ షో అనేది కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు పెట్టి, ఆ కారణంతో గొడవలు పెట్టడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చాలామంది ప్రేక్షకులు కూడా ఆ గొడవల కోసమే బిగ్ బాస్ చూస్తారు. నామినేషన్స్‌లో అలాంటి గొడవలు సరిపడా జరుగుతాయి. ఇక తాజాగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్‌పై గతవారం జరిగిన రణధీర వర్సెస్ మహాబలి టీమ్స్ టాస్క్ ప్రభావం గట్టిగా ఉందని తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. పైగా సీరియస్‌గా జరగాల్సిన నామినేషన్స్‌ను టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్ కలిసి పూర్తిగా కామెడీ చేశారు.


కంటెస్టెంట్స్ మీద ద్వేషం పెంచుకున్న దామిని..
రెండో పవర్ అస్త్రా కోసం బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌గా విడిపోయి పోటీపడ్డారు. ఆ క్రమంలో ఒకరి టీమ్‌తో మరొకరికి లేదా ఆ టీమ్‌లో ఉన్నవారికి వారితోనే.. ఇలా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఆ గొడవలు అన్నీ గుర్తుపెట్టుకొని నామినేషన్స్‌లో ఎవరిని సెలక్ట్ చేయాలి అని కూడా కొందరు కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిపోయారు. అదంతా తాజాగా నామినేషన్స్‌లో స్పష్టంగా కనిపించిందని ప్రోమోలో తెలుస్తోంది. ముందుగా బిగ్ బాస్ సీజన్ 7లో మూడో నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోలో దామిని.. ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయడానికి వచ్చింది. ‘‘ఇద్దరికే ఛాన్స్ ఉంది. అవకాశం ఉంటే అందరికీ వేసేదాన్ని’’ అనే స్టేట్‌మెంట్‌తో తన నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.


నామినేషన్స్‌ను ఒప్పుకోని ప్రియాంక..
తాజా నామినేషన్స్‌లో గౌతమ్ కృష్ణ.. రతికను నామినేట్ చేశాడు. దీనికి గతవారం జరిగిన గొడవే కారణమని కూడా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే మరోసారి రతికతో ఈ విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. తప్పు, ఒప్పు మధ్య ఉన్న తేడా గురించి చెప్పాడు. అప్పుడు రతిక ‘‘కరెక్ట్ పాయింట్ ఉంటేనే నేను మాట్లాడతా’’ అంటూ రివర్స్ సమాధానం ఇచ్చింది. తను తప్పా మిగతా 11 మందిని ఇబ్బంది పెడుతుందంటూ రతిక మీద సీరియస్ అయ్యాడు గౌతమ్. మాట్లాడనివ్వడం లేదంటూ గౌతమ్ మీద అరిచింది రతిక. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ వచ్చి ప్రియాంక యాటిట్యూడ్ బాలేదంటూ తనను నామినేట్ చేయడానికి పిలిచాడు. దానికి ప్రియాంక ఒప్పుకోలేదు. శుభశ్రీ కూడా ప్రియాంకనే నామినేట్ చేయాలని చూడగా.. తన మీద కూడా అరిచింది ప్రియాంక. దాని వల్ల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శుభశ్రీని నామినేట్ చేసింది దామిని. అప్పుడు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నావంటూ శుభశ్రీ వ్యాఖ్యలు చేసింది. 


తేజ, ప్రశాంత్ కామెడీ..
అసలు పనిచేయడం లేదు అనే కారణంతో అమర్‌దీప్.. ఒక కంటెస్టెంట్‌ను నామినేట్ చేశాడు. టేస్టీ తేజ నామినేషన్స్‌తో కాస్త ఫన్ మొదలయ్యిందని ప్రోమోలో కనిపిస్తోంది. ముందుగా టేస్టీ తేజను శుభశ్రీ నామినేట్ చేసింది. అప్పుడు తేజ.. ‘బరాబర్ వస్తా’ అంటూ తొడకొట్టాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తున్నా అంటూ తేజ ప్రకటించాడు. ‘బిగ్ బాస్ ప్రక్రియ నీకు సరిగా అర్థం కావడం లేదని నా ఫీలింగ్’ అంటూ కారణం చెప్పాడు. ‘నాకు అర్థమవ్వడం లేదని నీకెలా తెలుసు’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు ప్రశాంత్. ‘బిగ్ బాస్ నన్ను పాయింట్ మాట్లాడనివ్వడం లేదు’ అంటూ బిగ్ బాస్‌తో చెప్పుకొని వాపోయాడు తేజ. ఆ తర్వాత ప్రశాంత్ ప్రవర్తనను తట్టుకోలేక ‘హౌజ్‌మేట్స్ చూడండయ్యా ఇది’ అని చెప్పుకోగా.. వారంతా దీనికి నవ్వుకున్నారు. ఇక తొడకొట్టడం అనే విషయాన్ని కూడా ఇద్దరూ కామెడీ చేశారు. ‘నేను కొడతా నీ తొడ’ అంటూ ప్రశాంత్ తొడకొట్టాడు తేజ. ఇదంతా చూసి పడిపడి నవ్వుకున్నారు కంటెస్టెంట్స్.



Also Read: ‘బిగ్ బాస్’ ఇంట్లో నామినేషన్స్ రచ్చ - దామినిని వెక్కిరించిన యావర్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial