బిగ్ బాస్ సీజన్ 7లో రెండో వారం నామినేషన్స్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగాయి. కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాగ్వాదాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సోమవారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో శివాజీకి జరిగిన నామినేషన్స్ హైలెట్‌గా నిలిచాయి అనుకునేలోపే.. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేయాలి అనుకునేవారి గురించి పిలుపు వచ్చింది. వెంటనే ఆరుగురు కంటెస్టెంట్స్.. తనను నామినేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్స్ చెప్పిన కారణాలు, వారికి ప్రశాంత్ ఇచ్చిన సమాధానాలు వాగ్వాదాలకు దారితీశాయి. ముఖ్యంగా అమర్‌దీప్ అయితే పల్లవి ప్రశాంత్‌ను మట్లాడనివ్వకుండా ఉగ్రరూపం దాల్చి ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచాడు.


ముందుగా గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక, దామిని, షకీలా.. పల్లవి ప్రశాంత్‌ను పలు కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ప్రియాంక, గౌతమ్ నామినేట్ చేస్తున్న సమయంలో ప్రశాంత్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. వ్యంగ్యంగా మట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో శివాజీ కూడా ప్రశాంత్‌కు సపోర్ట్‌గా ముందుకు వచ్చాడు. కానీ ఇతర కంటెస్టెంట్స్ అంతా ప్రశాంత్‌దే తప్పు అన్నట్టుగా, అతడి తప్పు ఈరోజు ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. చివరికి అమర్‌దీప్ ఎంటర్ అయిన తర్వాత మాత్రం అతడి చెప్పిన పాయింట్స్‌కు, మాట్లాడిన మాటలకు ప్రేక్షకులతో పాటు ఇతర కంటెస్టెంట్స్ కూడా ఫిదా అయిపోయారు.


నేర్చుకొని వచ్చిన నటుడివి..
పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేయడానికి వచ్చిన అమర్‌దీప్.. ఇంటి పనుల్లో ఎక్కువగా కనిపించు అని మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ‘నీకు రెండు మొహాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉపయోగిస్తున్న బాడీ లాంగ్వేజ్ ఇంట్లో లేదు. అదే ఇంట్లో చేస్తే ఎంటర్‌టైన్మెంట్. నువ్వు కూడా ప్రేక్షకులకు సుపరిచితుడివే. నీ వీడియోలు బాగా ట్రోల్ అయ్యాయి’ అంటూ సీరియస్‌గా చెప్పడం మొదలుపెట్టాడు. కానీ పల్లవి ప్రశాంత్ వింటున్న పద్ధతి అమర్‌దీప్‌కు నచ్చలేదు. దీంతో భుజం దించు అంటూ బెదిరించాడు. ‘ఎన్నో సీజన్లు చూసి వచ్చావు’ అని అమర్‌దీప్ అన్న మాటను ప్రశాంత్ ఒప్పుకోలేదు. ‘మరి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది’ అని అడిగితే ‘కేవలం నాగార్జున సార్‌నే చూశాను’ అంటూ సమాధానం ఇచ్చాడు. అదంతా కాదు కానీ నిజమైన ప్రశాంత్‌ను చూడాలని ఉందని అమర్‌దీప్ అన్నాడు. ‘అంటే ఫేక్‌గా ఉన్నానా’ అని ప్రశాంత్ ప్రశ్నించాడు. ‘సందర్భానికి తగినట్టు అల్లుకుపోతున్నావు. ఎన్నో సీజన్లు పర్యవేక్షిస్తే కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ రాదు’ అని విమర్శించాడు అమర్‌దీప్. అలా మాట్లాడుతున్న సమయంలో కూడా ప్రశాంత్ ప్రవర్తన నచ్చని అమర్‌దీప్.. ‘నీకంటే పెద్ద నటుడిని. నువ్వు వెధవ అయితే నేను పరమ వెధవ’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ప్రతీసారి రైతుబిడ్డ కష్టాలు అంటున్నావు కానీ బీటెక్ కష్టాలు ఇలా ఉంటాయి అంటూ అమర్‌దీప్ చెప్పిన మాటలకు సందీప్, రతిక చప్పట్లు కొట్టారు. రైతుబిడ్డ అనే పదం వాడుతున్నావు అని అమర్‌దీప్ చెప్పగా.. ఆ మాట ప్రశాంత్ అసలు ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఇద్దరు గొంతులేపారు. మధ్యలో ‘నాకు యాక్టింగ్ అంటే ఇష్టం’ అని ప్రశాంత్ అనగా.. ‘నువ్వు ఇప్పుడు చేస్తుంది అదే’ అని అమర్‌దీప్ అరిచాడు, ‘నేను పుట్టుకతో నటుడిని, నువ్వు నేర్చుకొని వచ్చిన నటుడివి’ అన్నాడు. ఒకరినొకరు దూషించుకోవడం అయిపోయిన తర్వాత తన చదువు కష్టాలను చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.


కుక్కలాగా తిరిగాను..
‘చదువుకున్న వాళ్ల కష్టం నాకు తెలియదు అంటే బాధనిపించింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్. తాను కూడా డిగ్రీ వరకు చదివానని బయటపెట్టాడు. కానీ ఎవరి కింద పనిచేయడం ఇష్టం లేక పొలం పనులు చేస్తున్నానని చెప్పాడు. ఆ మాటను అమర్‌దీప్ ప్రశంసించాడు. ‘కుక్కలాగా స్టూడియో చుట్టూ తిరిగాను’ అని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు రతిక.. ‘కుక్కలాగా తిరిగి ఇప్పుడేం చేస్తున్నావు’ అంటూ ప్రశ్నించింది. దానికి కంటెస్టెంట్స్ చప్పట్లు కొట్టారు. గౌతమ్ చెప్పిన మాటను కూడా గుర్తుచేశాడు అమర్‌దీప్. అప్పుడు గౌతమ్ కూడా మళ్లీ తన పాయింట్‌ను మాట్లాడడానికి ముందుకు రాగా అమర్‌దీప్ తనను అడ్డుకున్నాడు. చివరిగా ‘నీలాగా ఉండు, ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వు, సెంటిమెంట్ వాడకు’ అని చెప్పాడు అమర్‌దీప్. అలా పల్లవి ప్రశాంత్‌కు నామినేషన్స్‌లో 6 ఓట్లు పడ్డాయి.


Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో నామినేషన్స్‌లో ఉన్నది వీరే - డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial