బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ మొదలై వారం రోజులు పూర్తయింది. మొదటి వారం హౌస్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఇక సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. మొత్తంగా ఈ వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.  వారెవరంటే..? సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టా.



వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బిందు మాధవి మాటలకు తేజస్వి బాధపడింది. మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారియర్స్ టీమ్ నుంచి ఒకరు, ఛాలెంజర్స్ టీమ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు అడిగే ప్రశ్నలకు అవతలి వ్యక్తి పొంతనలేని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన టీమ్ ఓడిపోయిన వాళ్లకి పనిష్మెంట్ ఇవ్వాలి. 


ఈ క్రమంలో కెప్టెన్ తేజస్వి.. ఛాలెంజెర్స్ మరోసారి టాస్క్ లో గెలిచేవరకు అన్ని పనులు వాళ్లే చేయాలని ఆదేశించింది. ఆ తరువాత కాదంటూ మాట మార్చింది. దీంతో బిందు మాధవి, చైతు గట్టిగా అరుస్తూ.. 'నువ్ మాట మార్చావ్' అంటూ తేజస్విని లాక్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో సమాధానం చెప్పలేకపోయింది తేజస్వి. తను అలా అనలేదని.. తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పడానికి ప్రయత్నించింది. 


బిందు మాధవి కూల్ గా మాట్లాడుతున్నా.. తేజస్వి మాత్రం ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. 'నేనే కుకింగ్ చేస్తా.. ఇన్నాళ్లు చేసిన పనికి విలువ లేకుండా పోయింది' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తను ఇంటి కెప్టెన్ కాబట్టి పనులు చేయాల్సిన అవసరం లేదని.. కానీ పర్లేదు చేస్తానంటూ ఏడ్చేసింది. ఈ మొత్తం టాస్క్ లో తేజస్వి కాస్త ఓవర్ గా రియాక్ట్ అయిందని అనిపించకమానదు.