మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మెగా అభిమానులందరికీ పండగే. ఆయన నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా తెలుగుతో పాటూ హిందీలో కూడా విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రోమోను ‘వైబ్ ఆఫ్ భోళా’ పేరుతో ముంబైలోని జుహు బీచ్ లో ప్రదర్శించారు. ఎన్నడూ లేనివిధంగా జుహూ బీచ్ దగ్గరి సముద్రంలో ఒక ఓడలో భారీ తెర కట్టి చిరు సినిమా వైబ్‌ను ప్రదర్శించారు. జుహూ బీచ్ నుంచి సందర్శకులు ఆ భారీతెరపై భోళా ప్రోమోను చూసి ఆనందించారు. ఈ వీడియోను ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘అద్భుతమైన ఆలోచన, ఇలా చేయడం తొలిసారి, ఓడలో భోళా సినిమా ప్రోమో వేయడం, చాలా మనోహరంగా ఉంది. ముంబైలోని జుహు బీచ్‌లో భోలా వైబ్’అని శీర్షిక పెట్టారు. 


భోళా శంకర్ సినిమాలో చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లు గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరు సోదరిగా నటిస్తోంది. అనిల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రఘుబాబు, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి... తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 


చిరు ప్రస్తుతం చేతినిండి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఏప్రిల్ 29న విడుదల కానుంది. భోళా శంకర్ తో పాటూ, గాఢ్ ఫాదర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇవి ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఈలోపే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకీ కుడుములతో ఆయన త్వరలో సినిమా చేయబోతున్నారు.