Pawan Kalyan Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అభిమానులను ఆకట్టుకునేలా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రైలర్‌లో ఒక ఎత్తు అయితే... థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు అనేలా ఉంది. మొత్తంగా సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేసేలా, ఫ్యాన్స్‌లో జోష్ నింపేలా ఈ ట్రైలర్ ఉంది. అయితే 8:10 గంటలకు విడుదల కావాల్సిన ట్రైలర్‌ను ఆలస్యంగా 9 గంటలకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేసింది.


ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కల్యాణ్‌కు జోడిగా నిత్యా మీనన్, రానాకు జోడిగా సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటించారు. వీరితో పాటు సముద్రఖని, మురళి శర్మ, రఘుబాబు, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ సినిమా అయ్యప్పనుం కోషియుంకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే మాతృకకు బోలెడన్ని మార్పులు చేసినట్లు తెలిపారు.


అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. థమన్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.


థమన్ సంగీతం అందించిన ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్, ‘లా లా భీమ్లా’, ‘అంత ఇష్టం ఏందయ్య’, ‘అడవి తల్లి మాట’, ‘లా లా భీమ్లా డీజే వెర్షన్’ అన్నీ పెద్ద హిట్ అయ్యాయి. దీంతోపాటు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్లకు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆడియన్స్, ఫ్యాన్స్‌కు సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి.


మొదట ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్‌ను జనవరి ఏడో తేదీన విడుదల చేస్తామని మొదట ప్రకటించడంతో దీన్ని ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనావైరస్ థర్డ్ వేవ్ కారణంగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డప్పటికీ... పెండింగ్ వర్క్ ఉండటం, థర్డ్ వేవ్ పీక్స్‌లో ఉండటంతో సినిమాను ఫిబ్రవరి 25వ తేదీనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మధ్యలో ఏప్రిల్‌కు వాయిదా వేయాలనుకున్నా... ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో ఫిబ్రవరి 25కే ఫిక్సయ్యారు.