BSS10: టాలీవుడ్ లో ఫుల్ బ్యాగ్రౌండ్ ఉండి కూడా ఇప్పటికీ స్టార్ హీరోలుగా నిలుదొక్కుకోలేకపోయిన హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో ‘అల్లుడు శీను’ లాంటి సినిమాతో మాస్ ఇమేజ్ ను తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తర్వాత ఆ క్రేజ్ ను కొనసాగించలేకపోయాడు. రీసెంట్ గా ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రిమేక్ చేసి అక్కడ కూడా భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. తాజాగా ఈ హీరో టాలీవుడ్ లో మరో సినిమాలో నటించనున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో ‘భీమ్లా నాయక్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బెల్లంకొడ సాయి. ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దర్శకుడు హరీష్ శంకర్ ముహూర్తం క్లాప్ కొట్టగా, డైరెక్టర్ పరశురాంతో కలసి మేకర్స్ కు మూవీ స్క్రిప్ట్ ను అందజేశారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను జూన్ 2 వ వారం నుంచి ప్రారంభించనున్నారు. 


ఈసారైనా హిట్ వచ్చేనా..


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న పదొవ సినిమా ఇది. అంతకముందు కూడా సాయి కు సరైన హిట్ లేదు. మధ్యలో వచ్చిన ‘రాక్షసుడు’ సినిమా ఓ మాదిరి హిట్ అందుకుంది. అయితే అది రిమేక్ సినిమా కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత సాయి చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ లుగానే నిలిచాయి. ఇక ఈ మధ్య తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రిమేక్ చేశారు. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు. కానీ ఫలితాలు మాత్రం చాలా దారుణంగా వచ్చాయి. అంతకముందు సాయి శ్రీనివాస్ నటించిన కొన్ని సినిమాలకు హిందీ యూట్యూలో వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ థియేటర్ల విషయానికిచ్చేసరికి అంచనాలు అన్నీ తారుమారయ్యాయి. దీంతో హీరో సాయి శ్రీనివాస్ ఖాతాలో మరో డిజాస్టర్ వచ్చి చేరింది. మరి ఈ సినిమాతో అయినా సాయి కు హిట్ అందుతుందేమో చూడాలి. 


సరికొత్త లుక్ లో బెల్లంకొండ..


సాగర్ కె చంద్ర స్క్రిప్ట్ రైటింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఆయన గత సినిమాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి చిత్రాలు కమర్షియల్ గా రానించలేకపోయినా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ‘భీమ్లా నాయక్’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు సాగర్. ఆ సినిమా తర్వాత సాగర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ మూవీలో ఒక కొత్త యూనిక్ సబ్జెక్టుతో సాయి శ్రీనివాస్ ను సరికొత్తగా చూపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీకు ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరాలందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పై  భారీ బడ్జెట్‌ తో మూవీను రూపొందనుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.





Also Read: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్?