రోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల థియేటర్ నిర్వాహకులు ఎంతగా నష్టపోయారో తెలిసిందే. అయితే, ఈ అవకాశాన్ని ఓటీటీ సంస్థలు బాగా సద్వినియోగం చేసుకున్నాయి. నిర్మాతలకు కూడా వేరే దారి లేకపోవడంతో అప్పట్లో నిర్మాణానికి వెచ్చించిన మొత్తానికే తమ సినిమాలను ఓటీటీలకు ఇచ్చి నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఓటీటీల్లో తమ ఫేవరెట్ స్టార్ సినిమా విడుదలవుతుందనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆయా యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు 2 శాతం మాత్రమే ఉన్న ఓటీటీ వినియోగదారులు ఇప్పుడు అనూహ్యంగా పెరిగారు. తాజా అధ్యయనం ప్రకారం.. దేశంలో 66 శాతం మంది ఓటీటీలు వినియోగిస్తున్నారని తెలిసింది. వీరంతా ఒకటి కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లను వినియోగిస్తున్నట్లు ‘ఇండియా సీటీవీ రిపోర్ట్-2021’ పేర్కొంది. 


కరోనా వైరస్‌‌కు ముందు ప్రజలు టీవీ వీక్షించినా.. సినిమాలను మాత్రం థియేటర్‌లోనే ఎంజాయ్ చేసేవారు. లాక్‌డౌన్ వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంట్లోనే ఎక్కువసేపు ఉండటం వల్ల ప్రజలు టీవీలో వచ్చే, సీరియళ్లు, రియాలిటీ షోలను భరించలేక.. సినిమాల కోసం ఓటీటీలను డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అలా మొదలైన ట్రెండ్.. ఇప్పుడు మరింత విస్తరిస్తోంది. దేశంలో ప్రముఖ సంస్థలన్నీ ఇప్పుడు ఓటీటీ బాట పట్టాయి. దీంతో పోటీ కూడా విపరీతంగా పెరిగింది. స్టార్ హీరోల సినిమాలను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో నిర్మాతల పంట పడుతోంది. 


ప్రతిభకు పట్టం: ఇన్నాళ్లు సినిమా అవకాశాల కోసం తిరిగిన కొత్త దర్శకులకు వైవిద్యమైన చిత్రాలను అందించే అవకాశాన్ని ఓటీటీలు కల్పిస్తున్నాయి. మంచి కథ ఉండి.. ప్రేక్షకులను ఆకట్టుకొనేలా చిత్రాలను తెరకెక్కించే యువ దర్శకులకు ఇప్పుడు డిమాండ్ లభిస్తోంది. మరోవైపు ప్రముఖ దర్శకులు సైతం వివిధ వెబ్‌సీరిస్‌ల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వెబ్‌సీరిస్‌ల ద్వారా కొత్త నటీనటులకు కూడా అవకాశాలు దక్కుతున్నాయి. సినిమా స్థాయిలో ప్రమాణాలు పాటిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు కూడా వెబ్‌సీరిస్‌లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 


దక్షిణాది భాషలపై ఫోకస్: ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి సినిమాలు, వెబ్‌సీరిస్‌లు కేవలం హిందీలో మాత్రమే డబ్ అయ్యేవి. అయితే, ఇప్పుడు అంతా తెలుగు, తమిళం భాషల్లో కూడా డబ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆధరణ పొందిన ‘మనీ హీస్ట్’ వెబ్‌సీరిస్‌ను హిందీ, తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేశారు. దీంతో ఆ వెబ్‌సీరిస్ వీక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. హిందీలో తెరకెక్కిన ‘మీర్జాపూర్’, ‘ఫ్యామిలీ మ్యాన్’ వంటి వెబ్‌సీరిస్‌లకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉంది. వివిధ ఓటీటీల్లో విడుదలవుతున్న వెబ్‌సీరిస్‌లు, సినిమాలను సైతం తెలుగులోకి అనువాదించే విడుదల చేస్తున్నారు. 


థియేటర్ ఖర్చులు కూడా కారణం: థియేటర్‌లో సినిమా చూస్తే ఆ మజాయే వేరు. అయితే, కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలంటే.. ఎంత ఖర్చవుతుందో తెలిసిందే. కనీసం నలుగురు సినిమా చూడాలంటే రూ.600 వరకు వెచ్చించాలి. స్నాక్స్ అదనంగా మరో రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాలి. అదే మొత్తాన్ని ఓటీటీలకు కట్టినట్లయితే.. ఏడాది మొత్తం బోలెడన్ని సినిమాలు, వెబ్‌సీరిస్‌లు చూడవచ్చు అనే ఆలోచన కస్టమర్‌లో కలుగుతోంది. అందుకే.. ఒకటి కంటే ఎక్కువ ఓటీటీలను డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు. ఒక్క ఓటీటీ యాప్‌ను కనీసం రెండు నుంచి మూడు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్ (టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్) మీద చూసేందుకు అవకాశం ఉంటుంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అనేక సినిమాలు ఈ ఓటీటీల్లో లభ్యమవుతున్నాయి. దీంతో ప్రేక్షకుడు వారికి నచ్చిన సినిమా చూసేందుకు వీలవుతుంది. ఇక ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుంటే.. దాదాపు థియేటర్ అనుభవమే కలుగుతుంది. ఈ వైరస్ కాలంలో అనవసరంగా బయటకు వెళ్లడం కంటే ఇంట్లో కూర్చొని సినిమా చూడటమే బెటర్ అనే ఆలోచన ప్రేక్షకుడిలో కలుగుతోంది. దీంతో థియేటర్లో సినిమా విడుదల అవుతుందని తెలిసినా.. ఏదో ఒక రోజు ఓటీటీలో వస్తుందనే ధీమాతో ప్రేక్షకుడు ఉన్నాడు. కేవలం భారీ బడ్జెట్ చిత్రాలను మాత్రమే థియేటర్ వెళ్లి చూడాలనే ఆలోచనలో మరికొందరు సినీ ప్రేమికులు ఉన్నారు. తక్కువ ధరకే ఇంటర్నెట్ లభించడం, స్మార్ట్ టీవీలు, ఫైర్ స్టిక్స్ అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు ఓటీటీలకు సులభంగానే కనెక్ట్ అవుతున్నారు. అయితే, ఈ కల్చర్ ఎక్కువ పట్టణాలు, నగరాల్లోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ థియేటర్లో బొమ్మపడితే చూడాలనే ఆలోచనతోనే ఉన్నారు. సీటీవీ రిపోర్ట్ ప్రకారం దేశంలో 78 శాతం మందికి స్మార్ట్ టీవీలు ఉన్నాయట. వీరిలో 93 శాతం మందికి ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా ఉన్నాయట. 


ఒకప్పుడు కమలహాసన్‌కు వచ్చిన ఐడియానే ఇది: 2013 సంవత్సరంలో ‘విశ్వరూపం’ సినిమా విడుదల సమయంలోనే కమలహాసన్‌కు ఈ ఆలోచన వచ్చింది. అయితే, అప్పట్లో ఓటీటీలు అందుబాటులో లేవు. డైరెక్ట్ టు హోమ్ (DTH) మాత్రమే ఉండేది. దీంతో కమలహాసన్ తన చిత్రాన్ని థియేటర్లతోపాటు డీటీహెచ్‌లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కేవలం ఒకే షో డీటీహెచ్‌లో ప్రసారం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవచ్చని ప్రయత్నించారు. అయితే, థియేటర్ యాజమాన్యం కమల్ మీద తిరుగుబాటు చేశారు. ఇలా చేయడం వల్ల భారీగా నష్టపోతామని పేర్కొన్నారు. దీంతో కమల్ నిర్ణయాన్ని నిర్మాతలు సైతం వ్యతిరేకించారు. థియేటర్ యాజమాన్యానికి మద్దతు తెలిపారు. అయితే, తమిళనాడు జనాభాలో కేవలం 3 శాతం మందికే డీటీహెచ్ సదుపాయం ఉందని, దానివల్ల పెద్దగా నష్టం ఉండదని కమల్ సమాధానం చెప్పారు. కానీ, థియేటర్ యాజమాన్యం పట్టు వదల్లేదు. దీంతో సినిమా థియేటర్‌లో విడుదలైన వారం రోజుల తర్వాత ఆ చిత్రాన్ని డీటీహెచ్‌లో ప్రసారం చేశారు. అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. తమ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనే సందేహాలతో సతమతమయ్యే నిర్మాతలు ఓటీటీలతో బేరాలాడుతున్నారు. కొన్ని సినిమాలను ప్రత్యేకించి ఓటీటీల కోసమే నిర్మిస్తున్నారు. నూరు శాతం అక్యుపెన్సీ లేకపోవడం వల్ల పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందో లేదో అనే సందేహాలు కూడా నిర్మాతలను వెంటాడుతోంది. అయితే, థియేటర్ మీదే ఆధారపడి జీవించేవారికి మాత్రం ఓటీటీ శాపంగా మారిందనే చెప్పుకోవాలి.


ప్రైవసీ ముప్పు: ఓటీటీల్లో సినిమాలు విడుదల కావడం వల్ల ప్రైవసీ ముఠాలు పండగ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు థియేటర్లో సినిమా విడుదలైనప్పుడు హెచ్‌డీ ప్రింట్లు వచ్చేవి కావు. ఓటీటీల వల్ల ప్రైవసీ గ్యాంగ్స్ సులభంగానే వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నాయి. ‘టెలిగ్రామ్’ తదితర యాప్స్ ద్వారా సినిమా ఓటీటీల్లో విడుదలైన రోజే లీక్ చేస్తున్నారు. దీనివల్ల ఓటీటీలు వీక్షకుల సంఖ్య తగ్గుతోంది. అయితే, ఆ ప్రాభావం నిర్మాతలపై మాత్రం పెద్దగా ఉండదు. ఎందుకంటే.. అప్పటికే వారు పూర్తి హక్కులను ఓటీటీలకు విక్రయించేస్తారు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేదు. అయితే, కొన్ని ఓటీటీలు మాత్రం.. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా.. ఆ సినిమా లేదా వెబ్‌సీరిస్‌కు లభించే వ్యూస్ ఆధారంగానే చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల విడుదలైన హీరో నాని చిత్రం ‘టక్ జగదీష్’ సినిమాను రూ.34 కోట్లతో నిర్మించగా.. ఓటీటీ సంస్థ రూ.37 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం.