రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వసూళ్లలో దుమ్ము రేపుతుంది. రెండో వీకెండ్ ముగిసేసరికి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే రూ.78 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ప్రీమియం ఫార్మాట్లకు టికెట్లు సంపాదించడం ఇప్పటికీ కష్టంగానే మారింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక మల్టీఫ్లెక్స్‌ల్లో ఒకటైన ఏఎంబీ సినిమాస్‌లో కూడా ఎనిమిది రోజుల్లోనే రూ.కోటి గ్రాస్‌ను వసూలు చేసింది.


మనదేశంలో ఓవరాల్‌గా రూ.310 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. రూ.437 కోట్లతో అవెంజర్స్: ఎండ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. రూ.290 కోట్లతో అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్ మూడో స్థానానికి పడిపోయింది.


అమెరికా, చైనా, కొరియా, ఫ్రాన్స్‌ల తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’కి అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా నిలిచింది. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వీకెండ్‌లో నంబర్ వన్ సినిమాగా అవతార్‌నే నిలిచింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రూ.21 కోట్ల గ్రాస్ వసూళ్లతో రవితేజ ‘ధమాకా’ మొదటి స్థానంలో నిలవగా, రూ.16.5 కోట్లతో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రెండో స్థానంలో ఉంది.


ప్రపంచవ్యాప్తంగా 850 మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును అవతార్ దాటేసింది. 1 బిలియన్ మార్కును చేరుకునేందుకు జనవరి 5వ తేదీ వరకు పడుతుందని మొదట్లో ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. కానీ అవతార్ స్పీడ్ చూస్తుంటే కొత్త సంవత్సరం వచ్చే లోపే ఆ మ్యాజికల్ మార్కును దాటేలా ఉంది.


కానీ అవతార్ బ్రేక్ ఈవెన్ కావడానికి రెండు బిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉందని జేమ్స్ కామెరూన్ అన్నారు. ఒకవేళ అవతార్ ఈ మార్కును దాటడంలో విఫలం అయితే మూడో భాగంతో అవతార్ ఫ్రాంచైజీని ముగించేస్తానని తెలిపారు. మరి అవతార్ ఈ మార్కును దాటుతుందా లేదా అనేది చూడాలి.


Also Read: Micheal First Single: పాన్ ఇండియా పాట వచ్చేస్తుంది - సందీప్ కిషన్ ‘మైకేల్’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?