ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అవతార్ రికార్డు 12 ఏళ్లు గడిచినా ఇంకా చెక్కు చెదరలేదు. సీక్వెల్ అనౌన్స్ చేయగానే సోషల్ మీడియా ఊగిపోయింది. మొత్తం నాలుగు సీక్వెల్స్ రాబోతున్నట్లు ప్రకటించారు. రెండో సీక్వెల్ కి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' అనే టైటిల్ పెట్టారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను 'డాక్టర్ స్ట్రేంజ్' మూవీ థియేటర్లలో ప్లే చేశారు. ఇప్పుడు నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 


ముందుగా పండోరా గ్రహానికి సంబంధించిన స్టన్నింగ్ విజువల్స్‌తో ట్రైలర్ మొదలైంది. పండోరాలోని అద్భుతమైన లొకేషన్లు, చూడగానే మైమరపించే నీలి రంగులోని సముద్రాన్ని తర్వాత చూపిస్తారు. అక్కడ నుంచి సినిమా పేరును జస్టిఫై చేస్తూ విజువల్స్ అండర్ వాటర్‌లోకి వెళ్తాయి. హీరో శామ్ వర్తింగ్‌టన్ చేసిన జేక్ సల్లీ, హీరోయిన్ జో సల్దానా 'నేతిరి' పాత్రలకు సంబంధించిన కొత్త క్లోజప్ షాట్లను ఇందులో చూడవచ్చు. 


అయితే ఇందులో కొత్తగా కనిపించేవి జేక్ సల్లీ, నేతిరికి పుట్టిన పిల్లలే. వీరు సగం మనుషులు కాగా, సగం పండోరాకు చెందిన నావి జాతికి చెందిన వారు. హీరో, హీరోయిన్ దత్తత తీసుకున్న జాక్ చాంపియన్  అనే కొత్త పాత్ర ఇందులో ఉంది. ఆ తర్వాత పండోరాలోని సముద్ర జీవులను చూడవచ్చు. ఇవి పెద్ద సైజులో ఉండటంతో పాటు అక్కడి వారితో స్నేహపూరితంగానే ఉన్నాయి. టైటానిక్ ఫేమ్ ‘కేట్ విన్‌స్లెట్’ను నావి గ్రహానికి చెందిన వ్యక్తిగా చూపించారు. ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది. ‘నాకు ఒక్క విషయం మాత్రం తెలుసు. మనం ఎక్కడికి వెళ్లినా... కుటుంబమే మనకు కోట.’ అని హీరో అంటాడు.


దీన్ని బట్టి ఇందులో గాడ్ ఫాదర్ తరహా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గతంలోనే నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇందులో కథేంటి అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 కూడా విడుదల కానున్నాయి. 


Also Read: 'సర్కారు వారి పాట' సెన్సార్ రివ్యూ!


Also Read: 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తే' - 'మేజర్' ట్రైలర్ వేరే లెవెల్