బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ (Anasuya Bharadwaj). 'జబర్దస్త్' షోతో ఆమెకి పాపులారిటీ బాగా పెరిగింది. ఇదే సమయంలో ఆమెపై సినీ అవకాశాలు కూడా వచ్చాయి. వచ్చిన ప్రతీ ఆఫర్ ను ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. 'క్షణం', 'రంగస్థలం' వంటి సినిమాలు అనసూయకు మంచి పేరుని తీసుకొచ్చాయి. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా ఆమె నటనను అంత ఈజీగా మర్చిపోలేం. అప్పటినుండి అనసూయను అందరూ రంగమ్మత్త అనే పిలుస్తున్నారు. 


ఈ సినిమా తరువాత ఆమెకి చాలా అవకాశాలే వచ్చాయి. 'ఎఫ్ 2', 'యాత్ర', 'కథనం' లాంటి సినిమాల్లో నటించింది. 'చావు కబురు చల్లగా' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. ఇటీవల ఆమె నటించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రా స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అందులో 'పుష్ప' ఒకటి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


ఇందులో అనసూయ కీలకపాత్రలో కనిపించనుంది. రంగమ్మత్తగా అనసూయను వెండితెరపై సుకుమార్ చూపించిన తీరు జనాలను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఆయన తన సినిమాలో అనసూయను తీసుకోవడంతో ఈసారి ఎలా చూపిస్తారనే క్యూరియాసిటీ అందరిలో పెరిగింది. ఈ క్రమంలో ఇటీవల సెట్స్ పైకి వచ్చిన అనసూయ ఫోటోలు బయటకొచ్చాయి. ఆమె లుక్ ని చూసినవారంతా షాక్ అవుతున్నారు. చూడడానికి అనసూయ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. బాయ్‌కట్‌ హరి స్టయిల్ తో మాస్ లుక్ లో కనిపించింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 




ఇవి చూసిన నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అసలు ఈమె అనసూయేనా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఆ లుక్ ఏంటని ట్రోల్ చేస్తున్నారు. కొందరు మీమ్స్ క్రియేట్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ నటుడు సునీల్ భార్యగా కనిపించనుందని సమాచారం. 


ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.