బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో లలో ‘ది కపిల్ శర్మ షో’ కార్యక్రమం ఒకటి. ప్రముఖ యాంకర్ కపిల్ శర్మ ఈ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షో లో ఎప్పటికప్పుడు సెలబ్రెటీలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో చాలా డ్రామా జరగనుంది. ఎందుకంటే ఈసారి గెస్ట్ గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ హాజరయ్యాడు. ఇంకా ఈ స్పెషల్ ఎపిసోడ్ లో అక్షయ్ తో పాటు నోరా ఫతేహి, దిశా పటానీ, మౌని రాయ్, సోనమ్ బజ్వా లు కూడా కలిసి పాల్గొన్నారు. అయితే గతంలో కూడా అక్షయ్ కుమార్ ఈ షో కి వచ్చినపుడు ఆ ఎపిసోడ్ మంచి హిట్ అయ్యింది. దీంతో ఈసారి కూడా ఈ ఎపిసోడ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయంలా కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 


అక్షయ్ కుమార్ కపిల్ శర్మ షో కు వచ్చినప్పుడల్లా ఈ షో ఎంతో సరదాగా సాగుతుంది. ఈసారి కూడా అక్షయ్ అదే ఫన్ ను కొనసాగించారు. ప్రోమో ప్రారంభంలో అక్షయ్ తనకు చాలా టెన్షన్ గా ఉందని చెప్పారు. ఎందుకు అని అడిగితే. ఈసారి ఎంటర్టైనర్స్ టూర్ లో భాగంగా తాను నలుగురు హీరోయిన్లతో కలసి ఫారిన్ టూర్ కు వెళ్ళబోతున్నట్లు తెలిపారు. అసలే నలుగురు హీరోయన్లు, అది కూడా ఫారిన్ టూర్ అందుకే టెన్షన్ గా ఉందన్నారు. ఈ టూర్ కు వెళ్తున్నందుకు తనకు చాలా బాధగా ఉన్నట్టు ఇంట్లో నటించాలని, పొరపాటున టూర్ నుంచి తాను ఆనందంగా తిరిగి వస్తే తనకు ఇంకో ప్రోగ్రాం ఉండదంటూ.. అక్షయ్ తన భార్య ట్వింకిల్ ఖన్నా గురించి పరోక్షంగా ప్రస్తావించారు. అక్షయ్ మాటలకు సెట్ లో నవ్వులు పూచాయి.


ఇక అక్షయ్ కుమార్ కపిల్ షో కు వచ్చిన ప్రతిసారి కపిల్ స్నేహితులను, లేదా సోదరిని వేదికపైకి పిలుస్తాడు. అయితే ఈసారి కపిల్ ను ఆశ్చర్యపరిచాడు అక్షయ్. ఈసారి ఎపిసోడ్ లో కపిల్ తల్లిని వేదికపైకి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆమె తన కొడుకు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కపిల్ చిన్ననాటి విషయాలను వెల్లిడిస్తుంది. చిన్నప్పడు కపిల్ అల్లరి చేస్తే ఇరుగుపొరుగు వాళ్లు ఫిర్యాదు చేయడానికి వచ్చేవారని, తాను అందరి తల్లుల లానే కొడుకు వైపు మాట్లాడేదాన్నని చెప్పింది. వేదికపై తల్లీకొడుకుల అనుబంధాన్ని చూసి అక్షయ్ ఏడాదిన్నర క్రితం చనిపోయిన తల్లిని గుర్తు చేసుకున్నాడు. షోలో తన తల్లి గురించి కూడా మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ మొత్తం ఎమోషనల్ గా సాగినట్టే కనిపిస్తోంది. 


ఇదే ప్రోమో లో కపిల్ శర్మ నోరా ఫతేహిని ఉటంకిస్తూ, ఒక వ్యక్తి ఒక మహిళతో డేటింగ్‌ కు వెళ్లినప్పుడు, అతను రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించాలని అంటుంటే. ఇంతలో అర్చన పురాణ్ సింగ్ కలుగజేసుకొని "నోరా, ప్రపంచం మారిపోయింది, ఇప్పుడు మహిళలు చెల్లించగలరు." అని చెప్తుండగా దానికి నోరా స్పందిస్తూ ‘‘మీరు చెల్లించవచ్చు, కానీ నేను చెల్లించడం లేదు." అని బదులిచ్చింది. దీంతో సెట్ లో నవ్వులు పూచాయి. మొత్తంగా ఇలా ఈ ప్రోమో సరదాగా సాగింది. ఇక పూర్తి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 


ఇక అక్షయ్ కుమార్ సినిమా విషయానికొస్తే.. ఇటీవలె రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ‘సెల్ఫీ’ సినిమాలో అక్షయ్ నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 24 న విడుదల అయింది. ఈ సినిమా మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ కు రిమేక్. ఈ సినిమాలో నుష్రత్ భారుచ్చా, ఇమ్రాన్ హష్మీ, టిస్కా చోప్రా మరియు డయానా పెంటీ కూడా కీలక పాత్రల్లో నటించారు.


Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!