సినిమా ఇండస్ట్రీలో పుకార్లకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఏ భాష సినిమా అయినా ఇందుకు అతీతం కాదు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు అయితే వాటిపై రోజుకో రకం పుకార్లు వస్తుంటాయి. తాజాగా తమిళ స్టార్ నటుడు విజయ్ నటిస్తోన్న ‘లియో’ మూవీలో హీరోయిన్ గురించి పుకార్లు మొదలైయ్యాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కోసం టీమ్ అంతా కాశ్మీర్ కు బయలుదేరింది. కానీ ఆ షెడ్యూల్ పూర్తికాకుండానే త్రిష మూవీ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దానికి తోడు అంతక ముందు మూవీకు సంబంధించిన ఇంస్టాగ్రామ్ పోస్టులను కూడా త్రిష తొలగించడంతో ఈ వార్తలు నిజమే అనుకున్నారంతా. కానీ తాజాగా త్రిష చేసిన కొన్ని పోస్టులు మళ్లీ ఆమె తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నానని కన్ఫర్మ్ చేస్తున్నట్టు ఉన్నాయి. ప్రస్తుతం త్రిష చేసిన పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  


నటుడు విజయ్, త్రిష గతంలో కలసి నటించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి నటించబోతున్నారు. అంతేకాకుండా ‘మాస్టర్’ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో వస్తోన్న సినిమా కావడం, లోకేష్ క్రియేట్ చేసుకున్న యూనివర్స్ కి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ రావడం, ఆయన గతంలో తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమా దేశ వ్యాప్తంగా భారీ సక్సెస్ కావడంతో ఇప్పుడీ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఇటీవలే ‘లియో’ మూవీకి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో చరిత్ర సృష్టించింది. ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ ను కూడా భారీగానే చేస్తుండటంతో చిత్రంపై ఉత్కంఠ పెరిగింది. ఇలాంటి సమయంలో మూవీలో హీరోయిన్ గా చేస్తోన్న త్రిష మూవీ నుంచి తప్పుకుంది అనే వార్తలు విజయ్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 


అయితే తాజాగా త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఈ వార్తలపై స్పందించింది. సినిమా నుంచి త్రిష తప్పుకోలేదని, తాను ఇప్పుడు కాశ్మీర్ లో ‘లియో’ షూటింగ్ లో ఉందని స్పష్టం చేసింది. అలాగే త్రిష కూడా విమానంలో కాశ్మీర్ లో లాండ్ అవుతున్నప్పుడు వీడియోను ఫేర్ చేసింది. దానితో పాటు గోబీ పరాటా, మ్యాగీ ను తింటున్న ఫోటోలను కూడా జత చేసింది. దీంతో త్రిష ‘లియో’ నుంచి తప్పుకుంది అనే వార్తలకు చెక్ పడిందనే చెప్పాలి. మరో వైపు ‘లియో’ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ సినిమాలు యూనివర్స్ ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే అందులో ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ ‘లియో’ సినిమా కూడా అందులో భాగంగానే ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 


Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!