Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ చెప్పనుందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే సమంత కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేసింది. చివరిగా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా సమంత చేసిన పోస్ట్ వైరల్ అయింది. దీంతో ఆమె షూటింగ్ లకు గుడ్ బై చెప్పిందనే ప్రచారం మొదలైంది. ఆమె తన ఆరోగ్యం అలాగే వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టాడానికే ఈ బ్రేక్ తీసుకుంటుందనే టాక్ వచ్చింది. ఈ బ్రేక్ తో దాదాపు ఏడాదికి పైగానే సమంత సినిమాలకు గ్యాప్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇక తాజాగా సమంత తన విరామ సమయాన్ని ఓ ఆధ్యాత్మిక యాత్రతో ప్రారంభించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 


రాయవేలూరు గోల్డెన్ టెంపుల్ ను సందర్శించిన సమంత


నటి సమంత సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇస్తుందనే వార్తలు ఎప్పటినుంచో వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ సమంత కూడా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చేసింది. తన విరామ సమయాన్ని ఆధ్యాత్మిక యాత్రతో ప్రారంభించింది సమంత. ఇటీవలే ఆమె తమిళనాడు రాయవేలూరులోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించింది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఆ యాత్రకు సంబధించిన రోడ్ ట్రిప్ ఫోటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సమంతతో పాటు ‘లియో’, ‘మహరాజా’ సినిమాల నిర్మాత జగదీష్ కూడా ఉన్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసమేనా?


సమంత కొంత కాలం క్రితం మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో బాధపడింది.  ‘యశోద’ షూటింగ్ సమయంలో అది బయటపడింది. దానికి చికిత్స తీసుకుంటూనే మూవీకు డబ్బింగ్ చెప్పింది సమంత. కొన్నాళ్లు దానికి చికిత్స తీసుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొంది. అయితే ఆ సమస్య పూర్తిగా తగ్గలేనట్టు తెలుస్తోంది. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి పూర్తిగా తన ఆరోగ్యం పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో సమంత ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఆమె మయోసైటిస్ ను పూర్తిగా తగ్గించుకోవడానికి అమెరికా వెళ్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపు ఏడాదికి పైనే సమంత సినిమాలకు దూరంగా ఉండనున్నట్టు సమాచారం. అందుకే తీసుకున్న అడ్వాన్స్ లన్నీ వెనక్కి తిరిగిచ్చేసిందట సమంత.


‘ఖుషీ’ పైనే ఆశలన్నీ..


సమంత ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా ఇరగదీస్తోంది. ‘ఫ్యామిలీ మెన్’ వంటి వెబ్ సిరీస్ లలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇప్పుడు వస్తోన్న ‘సిటాడెల్’ పైనా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం సమంతకు ఈ ఏడాది అంతగా కలసి రాలేనట్టు కనిపిస్తోంది. సమంత చివరిగా ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడం సమంత టాలీవుడ్ కెరీర్ కు కాస్త మైనస్ అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు రాబోతోన్న ‘ఖుషి’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది సమంత. మరి ఈ మూవీ సమంతకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. 


Also Read: స్పీడ్ పెంచిన దళపతి - విద్యారంగంపై విజయ్ ఫోకస్, 234 నియోజకవర్గాల్లో ఆ సంస్థల ఏర్పాటు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial