తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సమంతా. టాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. నాగ చైతన్యతో ప్రేమ వివాహం తర్వాత  మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడింది. చివరకు తన వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలికింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అనారోగ్యం పాలైంద. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. అప్పటికే వ్యక్తిగత సమస్యలతో మానసికంగా చాలా వీక్ గా మారిపోయిన సమంతను, ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి  శారీరకంగా చాలా కుంగదీసింది.  ఏడాది పాటు రకరకాల చికిత్సల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంది. మళ్లీ ఎప్పటి మాదిరిగానే మామూలు మనిషిగా మారిపోయింది.


మయోసైటిస్ తర్వాత పరిస్థితులపై సమంతా ఎమోషనల్ పోస్టు  


తాజాగా తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను గుర్తు చేసుకుంటూ సమంతా ఎమోషనల్ అయ్యింది. కష్టాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియలో ఓ పెద్ద పోస్టు షేర్ చేసింది. మయోసైటిస్ తర్వాత తన జీవితంలో వచ్చిన అనేక మార్పులను వివరించింది.


నా శరీరంతో నేనే ఎన్నో పోరాటాలు చేశా!


"నాకు మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ అయి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. నా శరీరంతో నేనే ఎన్నో పోరాటాలు చేశాను. తిండి విషయంలో నోరు కట్టేసుకున్నాను. ఉప్పు, చక్కెర లేకుండా పథ్యంతో కూడిన ఆహారం తీసుకున్నాను. కొంతకాలం పాటు మందులే నాకు ఆహారం అయ్యాయి. ఇష్టం లేకపోయినా, ఎన్నో అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి ఈ జీవితం? ఎందుకు ఇలాంటి ఇబ్బందులు? అని ఆలోచించడం, ఆత్మ పరిశీలన చేసుకోవడానికే ఈ ఏడాది సమయం పట్టింది. సినిమాల పరంగానూ నేను చాలా వైఫల్యాలను ఎదుర్కొన్నాను. ఈ ఏడాది కాలంలో నేను ఎన్నో పూజలు చేశాను. ఎందరో దేవుళ్లను మొక్కుకున్నాను. వారి ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేశాను. మనసుకు ప్రశాంతతను, సమస్యలను ఎదుర్కొనే శక్తికి ఇవ్వమని దేవుళ్లను కోరుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.


అన్నీ మనకు అనుకూలంగా జరగవు!


’’అన్నీ మనకు అనుకూలంగా జరగవని ఈ ఏడాది నాకు తెలిసి వచ్చింది. కష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలో తెలిసి వచ్చింది. మన చేతుల్లో ఉన్నది మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. మన చేతిలో లేనిది మనం కంట్రోల్ చేయలేము. పోతే పోనీ అని వదిలేయాల్సిందే. సమస్యలను దాటడం కోసం ఒక్కో అడుగు ముందుకు వేయాల్సిందే. గతంలో జరిగిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ అక్కడే నిలిచి ఉండకూడదు. వాటిని దాటుకుని ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. నన్ను నన్నుగా ఇష్టపడే వారిని నేనూ ఇష్టపడుతాను. వారిని ప్రేమిస్తాను. నా శ్రేయోభిలాషుల మంచి కోసం ప్రయత్నిస్తా. అయితే, దేవుళ్లు మాత్రం మనం కోరుకున్నట్లుగానే మంచి చేస్తారు. ఒక్కోసారి మంచి చేయడం ఆలస్యం కావచ్చు. కానీ, తప్పకుండా మంచే చేస్తారు” అంటూ సమంతా ఓ సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండతో కలిస ‘ఖుషీ’ అనే సినిమాలో నటిస్తోంది. అటు ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.






Read Also: ప్రభాస్ మంచి మనసు - ‘సలార్‘ సిబ్బందికి అదిరిపోయే గిఫ్ట్