సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది నటి సాయి పల్లవి. ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ తన టాలెంట్ తో అతికొద్ది కాలంలోనే లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తన అందం, అభినయంతో పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని వార్తలు వస్తున్నాయి. గత కొద్ది కాలంగా సాయిపల్లవి సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ మధ్య కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ అనౌన్స్ చేయకపోవడంతో సాయి పల్లవి సినిమాల నుంచి విరమించుకోవాలి అనుకుంటుందని, అందుకే సినిమాలకు దూరంగా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 


సాయి పల్లవి మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇటీవల రానా హీరోగా వచ్చిన ‘విరాటపర్వం’ సినిమాలో కనిపించింది. తర్వాత ‘గార్గి’ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రాల తర్వాత సాయి పల్లవి ఏ సినిమాకు సైన్ చేయలేదట, అంతేకాకుండా పెద్ద పెద్ద హీరోలతో ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తుందని సమాచారం. అయితే సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు జార్జియాలో ఎమ్.బి.బి.ఎస్ పూర్తి చేసింది. తర్వాత సినిమాల మీద ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. అప్పటికే డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు పొందడంతో అవకాశాలు కూడా త్వరగానే వచ్చాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇప్పుడు సినిమాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకుందనే వార్త ఆమె అభిమానులను కలవరపెడుతోంది.


సాయి పల్లవికి బోలెడన్ని సినిమా అవకాశాలున్నాయి. మరి ఇలా ఎందుకు చేస్తుందని ఆరా తీస్తే.. చదువు తర్వాత సినిమాల్లో బిజీగా మారిపోవడం వల్ల వైద్య వృత్తికి న్యాయం చేయలేకపోయాననే బాధ మనసులో ఉండిపోయిందట. అందుకే కోయంబత్తూర్ లో సొంతంగా ఆసుపత్రి నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ ఆసుపత్రి ద్వారా సాయిపల్లవి, ఆమె చెల్లెలు పూజ కలసి ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నారని వినికిడి. ఇప్పుడా ఆసుపత్రి నిర్మాణం పనులు సాయి పల్లవి దగ్గరుండి చూసుకుంటోందని తెలిసింది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే వరకూ సినిమాల వైపు చూడనని చెప్పిందట. అందుకే పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. తిరస్కరిస్తుందని టాక్. ఆసుపత్రి పూర్తయిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉండి పేషెంట్లకు సేవ చేయాలనుకుంటుందని కూాడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ విషయంపై ఆమె స్పందించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే సాయి పల్లవి ఇక సినిమాలకు దూరం అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. మరి దీనిపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 



Also Read: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?