తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ప్రియమణి. ఒకప్పుడు పలువురు అగ్ర హీరోలతో కలిసి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత యుంగ్ హీరోయిన్లతో పోటీ పడలేక కాస్త సైడ్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. తాజాగా నాగ చైతన్య హీరోగా నటించిన ‘కస్టడీ’లో కీలక పాత్ర పోషించింది. రాజకీయ నాయకురాలిగా అద్భుత నటన కనబర్చింది. బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘జవాన్’ మూవీలోనూ కనిపించబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ చానెల్ తో మాట్లాడిన ఆమె ‘నో కిస్సింగ్ పాలసీ’పైన స్పందించింది. గత కొంత కాలంగా ముద్దు సీన్లలో నటించకపోవడానికి గల కారణాలను వివరించింది.  


ముద్దు సీన్లలో ఎందుకు నటించడం లేదంటే?


వాస్తవానికి తాను సినిమా పరిశ్రమలోకి వచ్చిన నాటి నుంచే నో కిస్సింగ్ పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్నానని ప్రియమణి తెలిపింది. తాను చేసే సినిమాలను చూసి భవిష్యత్ లో ఇబ్బంది పడకూడదనే ముద్దు సీన్లకు దూరంగా ఉంటున్నట్లు చెప్పింది. పెళ్లయ్యాక ఈ నిర్ణయాన్ని మరింత పకడ్బందీగా ఫాలో అవుతున్నట్లు వివరించింది. “పెళ్లి అయిన తర్వాత ముద్దు సీన్లలో అస్సలు నటించకూడదు అనుకున్నాను. సినిమాలో కేవలం ఓ క్యారెక్టర్ కోసం చేసినా, దాని వల్ల వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నేను ఏ సినిమా చేసినా, నా తల్లితండ్రులలో పాటు అత్తమామలు చూస్తారు. అలాంటి సన్నివేశాలు చేస్తే ఇంట్లో వాళ్లు కూడా ఇబ్బంది పడతారు. అలా వారు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ముద్దు సీన్ల వల్ల ముఖ్యంగా నా భర్తకు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను.  అందుకే నా పెళ్లి తర్వాత ఎలాంటి ముద్దు సీన్లలో నటించలేదు. సినిమాకు సైన్ చేసే ముందు ఈ విషయాన్ని మేకర్స్ కు చెప్తాను. ఈ కండీషన్ కు ఓకే అయితేనే సినిమా చేస్తానని చెప్పేస్తాను” అని వివరించింది.   


2017లో ప్రేమ వివాహం చేసుకున్న ప్రియమణి


2017లో ప్రియమణి ప్రేమ వివాహం చేసుకుంది. వ్యాపారవేత్త ముస్తఫా రాజాతో కొంత కాలం ప్రేమాయణం కొనసాగించిన ఆమె, ఆ తర్వాత బెంగళూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె పెళ్లైన కొత్తలో నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్రోలింగ్ నడిపించారు. ముస్లీంను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటూ ప్రశ్నించారు. లవ్ జీహాద్ బారిన పడిందని కామెంట్స్ పెట్టారు. ఆమె పిల్లలు కూడా లవ్ జీహాదీలుగానే మారుతారంటూ దారుణంగా విమర్శించారు. అలాంటి ట్రోలింగ్స్ పై స్పందించిన ప్రియమణి, తన మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. తనతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎవరు ఏం మాట్లాడుకున్నా, తాను పట్టించుకోనని తేల్చి చెప్పారు.






Read Also: ‘జవాన్’ మ్యూజిక్ రైట్స్ - ఓ మై గాడ్, ఆడియో రైట్సే అంత ఉంటే, మూవీకి ఎంత డిమాండ్ ఉంటుందో!