టి పూనమ్ కౌర్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడంతో పాటు, ప్రజా సమస్యలపైనా గొంతు విప్పుతోంది. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు నిత్యవసర వస్తువుల ధరల పెంపుపైనా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తోంది. తన పదునైన మాటలో విమర్శలు గుప్పించే పూనమ్, అంతే స్థాయిలో ట్రోలింగ్ కు గురైన సందర్భాలున్నాయి. కాసేపు సినిమాలు, రాజకీయాల గురించి పక్కన పెడితే పూనమ్ కు సంబంధించిన ఓ షాకింగ్ విషయం బయటకు వెల్లడి అయ్యింది.


2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పూనమ్


ఈ అందాల తార సుమారు రెండు సంవత్సరాలుగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఫైబ్రో మైయాల్జియా సమస్యతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ రుగ్మత కారణంగా చాలా ఇబ్బందులు పడుతోందట. ఫైబ్రో మైయాల్జియా కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతోందట. ప్రస్తుతం ఈ రుగ్మత నుంచి నయం కోసం పూనమ్ కేరళలో చికిత్స తీసుకుంటోంది. తాజాగా తన చికిత్సకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కేరళలో ఆయుర్వేద చికిత్స  


కేరళలోని ఆయుర్వేద నిపుణులు పూనమ్ కు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. గత కొంత కాలంగా ఆమె అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటున్నది. తొలుత తన సమస్యలకు సంబంధించి పలు ఆస్పత్రులు తిరిగినా పరిష్కారం లభించకపోవడంతో కేరళ ఆయుర్వేద వైద్యులను సంప్రదించిందట. వారు ఆమెను పరిశీలించి ఫైబ్రో మైయాల్జియా రుగ్మత ఉన్నట్లు తేల్చారట. ప్రస్తుతం అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఎక్సర్ సైజ్, టాకింగ్ థెరఫీతో పాటు సరైన సమయానికి మందులు తీసుకుంటోంది. గత కొంతకాలంగా తీసుకుంటున్న చికిత్స మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం ఈ విషయాన్ని పూనమ్ రహస్యంగా ఉంచింది. తాజాగా ఆమె చికిత్సకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అసలు విషయం వెల్లడైంది. 


రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న పూనమ్


తాజాగా పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తన చేతిని పట్టుకుని నడవడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటికి పూనమ్ కౌంటర్ ఇచ్చింది. తాను పడిపోతుంటే రాహుల్ పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాలపై విమర్శలు చేయడం సరికాదని వెల్లడించింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీకి చేనేత కార్మికుల సమస్యలను వివరించింది. వారికి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరింది.   


‘మాయాజాలం’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ


ఇక పూనమ్ సినిమాల విషయాలకు వస్తే.. తను  2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెల్చుకున్నది. ఆ సమయంలోనే  ఎస్వీ కృష్ణారెడ్డి ఆమెకు అవకాశం ఇచ్చారు. తన దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఈ చిత్రంతో తెలుగు తెరపై కనిపించిన పూనమ్,  ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, ఈనాడు, గణేష్, నాగవల్లి లాంటి సినిమాల్లో నటించింది.


Read Also: ప్రభాస్, ఆ రోజు నా కోసం డిన్నర్ కూడా తినకుండా వేచి చూశాడు - హీరో సూర్య