గాయత్రి గుప్త. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి, యాంకర్ గా, నటిగా రాణించింది. వెండితెరపై పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి ఆకట్టుకుంది. ‘ఫిదా’, ‘కొబ్బరి మట్ట’, ‘ఐస్ క్రీం’ లాంటి చిత్రాల్లో నటించింది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘బుర్రకథ’, ‘ఐస్‌క్రీమ్-2’, ‘దుబాయ్ రిటర్న్’, ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’, ‘సీతా అన్‌ ది రోడ్’, ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ లాంటి సినిమాల్లోనూ కనిపించింది. హీరోయిన్‌గా చేయకపోయినా, సైడ్ ఆర్టిస్టుగా అలరించింది.  


హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉంది- గాయత్రి


రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్త, పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పింది. “గత కొంత కాలంగా నేను ఆటో ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. గత ఏడాదిన్నర కాలంగా చికిత్స తీసుకుంటున్నాను. నెలకు ఒకటి రెండు ఇంజెక్షన్స్ తీసుకుంటాను. అవి తీసుకుంటేనే యాక్టివ్ గా ఉంటాను. లేదంటే పని చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, మంచానికే పరిమితం అవుతాను. నెలన్నర నుంచి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మెడికేషన్ డోస్ కూడా పెరిగిపోయింది. ఆయుర్వేద ఆశ్రమంలో పంచరకర్మ ఆయుర్వేద చికిత్స తీసుకున్నాను. ఆ చికిత్స నాకు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 15 ఏండ్లలో దొరకని రిలీఫ్ పంచకర్మలో దొరికింది. ఆరు నెలల పాటు అక్కడే చికిత్స తీసుకుంటే నయం అవుతందని చెప్పారు” అని వెల్లడించింది.


చికిత్స కోసం విరాళాల సేకరణ


ఇక తన చికిత్స కోసం విరాళాలు సేకరించాలని భావిస్తున్నట్లు గాయత్రి గుప్త చెప్పింది. “నా ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నా. 6 నెలల చికిత్స కోసం 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. అంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే, చికిత్స కోసం ఫండింగ్ చేపట్టాలి అనుకుంటున్నాను” అని వెల్లడించింది. అటు తన తండ్రి గురించి కూడా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తండ్రిని నేను ఎప్పుడు కూడా ఫాదర్‌గా భావించలేదని చెప్పింది. అతడు తనను ఎప్పుడూ పట్టించుకోలేదని వెల్లడించింది. నా దృష్టిలో తండ్రి అనే వాడు లేడు అనే బతుకుతున్నట్లు వివరించింది.


ఇక తాజాగా గాయత్రి ‘దయా’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ‘హైదరాబాద్ నైట్స్’ అనే సినిమా చేస్తున్నట్లు చెప్పింది. ఇందులో తాను చాలా క్యూట్ గా కనిపిస్తాని  వెల్లడించింది.


Read Also: వివాదంలో సోనియా అగర్వాల్‌ మూవీ, ఆ టైటిల్ పెట్టొద్దంటూ బెదిరిపులు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial