హీరో సిద్దార్థ్ గురించి దక్షిణాది ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉంటుంది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు సిద్దార్థ్. వరువాత వరుసగా లవ్ స్టోరీలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా కనిపిస్తున్నాడు. ఇటీవల ఆయన తన తల్లిదండ్రులకు మధురై ఎయిర్ పోర్ట్ లో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు సిద్దార్థ్. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 


ఇటీవల నటుడు సిద్దార్థ్ అతని తల్లిదండ్రులతో కలసి మధురై ఎయిర్ పోర్ట్ లో విమానం దిగి బయటకు వస్తుండగా తనను అక్కడి సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు. దాదాపు 20 నిమిషాల పాటు తమను ఇబ్బంది పెట్టారని అన్నారు. తల్లిదండ్రుల జేబులు, సంచుల్లో సొమ్మును తీయాలని డిమాండ్ చేశారని, హిందీలో మాట్లాడుతూ అసహనానికి గురి చేశారని వాపోయారు. ఇంగ్లీష్ లో మాట్లాడాలని కోరినప్పటికీ పట్టించుకోకుండా పదే పదే హిందీలో మాట్లాడి ‘ఇండియాలో ఇంతే’ అని అన్నారని చెప్పాడు. తమకు ఎదురైన పరిస్థితిపై విమానాశ్రయంలో పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 


నటుడు సిద్దార్థ్ ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉంటాయి. తెలుగులో మంచి హిట్ సినిమాల్లో నటించిన ఆయన కొన్నాళ్లు టాలీవుడ్ కు దూరంగా ఉన్నాడు. మొన్నామధ్య ‘మహా సముద్రం’ సినిమాలో నటించినా అది డిజాస్టర్ గా మిగిలింది. మరోవైపు తన డేటింగ్ వ్యవహారాలతోనూ సిద్దార్థ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. 2003 లో తన చిన్ననాటి స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన మేఘనాను పెళ్లి చేసుకున్నాడు సిద్దార్థ్. తర్వాత 2007 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచీ ఒంటరిగా ఉంటున్నాడు. 


Also Read : 'ఇడియట్ 2'తో హీరోగా అబ్బాయ్ ఎంట్రీ? - రవితేజ రియాక్షన్ విన్నారా?


అయితే తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోహా ఆలీ ఖాన్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసి తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత శృతి హాసన్ తో డేటింగ్ చేశాడు. కొన్నాళ్లు వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు కూడా. కమల్ హాసన్ కూడా వీరి ప్రేమను అంగీకరించారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల దూరమయ్యారు. తర్వాత నటి సమంతతో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. మళ్లీ దానికి కూడా ఎండ్ కార్డ్ పడింది. అయితే ఇటీవల నటి అదితిరావు హైదరీతో ప్రేమలో ఉన్నాడంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వారిద్దరూ పలు సందర్భాల్లో కలసి కనిపించారు. దీంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఇక తాజాగా ఎయిర్ పోర్ట్ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచాడు సిద్దార్థ్.