పృథ్వీరాజ్ సుకుమారన్. మలయాళ స్టార్ హీరో. పలు భాషల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. మలయాళం, తెలుగు, హిందీ సినీ ఇండస్ట్రీలలో చాలా మంది అభిమానులున్నారు.  పృథ్వీరాజ్ తాజాగా బాలీవుడ్ మూవీ ‘బడే మియా చోటే మియాన్’ తొలి షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ లో షూటింగ్ లోనూ పాల్గొనబోతున్నారు. మరోవైపు తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘L2E’ కోసం లొకేషన్స్ ను పరిశీలిస్తున్నారు.


సూర్యతో ఎలాంటి బయోపిక్ చేయట్లేదన్న పృథ్వీరాజ్


గత కొంత కాలంగా సుకుమారన్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సూర్య హీరోగా ఆయన ఓ బయోపిక్ రూపొందిస్తున్నట్లు సినీ సర్కిల్స్ లోనూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా సుకుమారన్ టీమ్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. సుకుమారన్ సూర్యతో కలిసి ఎలాంటి బయోపిక్ చేయడం లేదని తెలిపింది. “పృథ్వీరాజ్ సుకుమారన్, సూర్యతో కలిసి ఎలాంటి బయోపిక్ చేయడం లేదు. ప్రస్తుతం పృథ్వీరాజ్ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించబోతున్నారు. వాటిలో ఒకటి ‘L2E’ కాగా మరొకటి ‘టైసన్’’ అని వెల్లడించింది.


ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్న పృథ్వీరాజ్


అటు పృథ్వీరాజ్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన సొంత బ్యానర్ సరిగమ నిర్మించనున్న వెబ్ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగమ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ సైతం ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.  ప్రస్తుతం సుకుమారన్ చేస్తున్న ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాక ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 2024 ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కావొచ్చని తెలుస్తోంది.  


వరుస సినిమాలతో పృథ్వీరాజ్ ఫుల్ బిజీ


పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం,  ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘మియాన్ చోటే మియాన్‌’లో కబీర్‌ అనే నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.  అటు ఓ సైకలాజికల్ డ్రామా కోసం స్టార్ కిడ్ ఇబ్రహీం అలీ ఖాన్, సీనియర్ నటి కాజోల్‌తో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది.  త్వరలో పాన్ ఇండియన్ మూవీ ‘సలార్‌’లో తన పెండింగ్ పోర్షన్‌ షూట్ కంప్లీట్ చేసుకోనున్నారు. ప్రశాత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28 న తెరపైకి రానుంది.  ఆ తర్వాత నటనకు కొద్ది విరామం ప్రకటించి ‘L2E’తో పాటు ‘టైసన్’ అనే సినిమాలకు దర్శకత్వం వహించనున్నారు. హీరోగా రాణించిన పృథ్వీరాజ్ మలయాళంలో ‘లూసిఫర్’ (తెలుగులో ‘గాడ్ ఫాదర్’) మూవీతో దర్శకుడిగా మారారు. మరోవైపు సూర్య ప్రస్తుతం ‘సూర్య42’లో హీరోగా చేస్తున్నారు. ఇందులో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.


Read Also: రామ్ చరణ్‌ ఫేవరెట్ మూవీస్ ఇవేనట - ఆ సినిమా 50 సార్లు చూశాడట!