సీనియర్ నటుడు నాజర్ కు గాయాలయ్యాయి. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా తెలంగాణా పోలీస్ ఎకాడమీలో షూటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో మెట్లపై నుంచి దిగుతుండగా.. నాజర్ జారి పడడంతో ఆయన ముఖంపై గాయమైంది. వెంటనే దగ్గరలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. చిన్న గాయాలేనని వైద్యులు తెలిపారు. నాజర్ తో పాటు నటి సుహాసిని, హీరోయిన్ మెహ్రీన్, శియాజి శిండే లు కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. 


ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. నటుడిగా నాజర్‌కు సౌత్ లో మంచి పేరుంది. ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారాయన. నటుడిగానే కాకుండా.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా వర్క్ చేశారు. 1985లో 'కల్యాణ అగితీగల్‌' సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు నాజర్. ఆ తర్వాత 'నాయకన్‌' సినిమాతో అతడికి మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత వరుసగా హిట్ సినిమాల్లో నటించారు. 'రోజా', 'తేవర్‌ మగన్‌', 'బొంబాయి', 'కురుతి పునల్‌'...లాంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించారాయన. 


నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు చేశారు. 1995లో 'అవతారం' సినిమాను డైరెక్ట్ చేశారు. జానపద సంస్కృతి, కళారూపాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1997లో 'దేవతార్‌' అనే మరో సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. ఆ తరువాత 'మాయన్', 'పాప్ కార్న్', 'సన్ సన్ తాతా' సినిమాలకు దర్శకుడిగా పని చేశారు. 


సినిమాలకు గుడ్ బై చెబుతారని రూమర్స్:కొన్ని రోజుల క్రితం నాజర్ సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేసి పర్మినెంట్గా ఇంటికే పరిమితమవ్వాలని చూస్తున్నారట. కోవిడ్ సమయంలో గుండె సంబంధిత సమస్యను ఎదుర్కోవడంతో ఇక రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు నాజర్. మరి ఆయన నుంచి రిటైర్మెంట్ ప్రకటన వస్తుందేమో చూడాలి!






Also Read : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?


Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ