Aamir Khan-Lokesh Kanagaraj Movie: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘సితార జమీన్ పర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘తారే జమీన్ పర్’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అటు ‘అందాజ్ అప్నా అప్నా’ దర్శకుడు రాజ్‌ కుమార్ సంతోషితో కలిసి ఓ మూవీ గురించి చర్చిస్తున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘చార్ దిన్ కి జిందగీ’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు అమీర్ ఖాన్..  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


సూపర్ హీరో మూవీ గురించి డిస్కర్షన్


లోకేష్ కనగరాజ్, అమీర్ ఖాన్ కలిసి ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.“లోకేష్ కనగరాజ్, అమీర్ ఖాన్ గత కొన్ని నెలలుగా చాలాసార్లు సమావేశం అయ్యారు. వీరిద్దరు కలిసి ఓ సినిమా గురించి చర్చిస్తున్నారు. ఓ సూపర్ హీరో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా రెడీ అయినట్లు సమాచారం. ఈ స్క్రిప్ట్ అమీర్ ఖాన్ కు నచ్చితే  సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది” అని నివేదికలు వెల్లడిస్తున్నాయి.


2026లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశం


ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్‌’తో బిజీగా ఉన్నారు. 2025లో రాజ్‌ కుమార్ సంతోషి, జోయా అక్తర్, అవినాష్ అరుణ్‌ లో ఒకరితో సినిమా చేసే అవకాశం ఉంది. అటు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో కలిసి ‘కూలీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2025లో ‘కైతీ 2’ సినిమాను తెరకెక్కించనున్నారు. అమీర్‌ కు స్క్రిప్ట్ నచ్చితే, సూపర్ హీరో మూవీ 2026లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   


‘కూలీ’లో అమీర్ ఖాన్ అతిథి పాత్ర


ఇక రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీలో అమీర్ ఖాన్ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ హీరో మూవీ చర్చల సందర్భంగా లోకేష్, అమీర్ ను ‘కూలీ’ సినిమాలో గెస్ట్ రోల్ చేయాలని అడిగారట. ఆయన కూడా సరే అని చెప్పారట. త్వరలోనే అమీర్ ‘కూలీ’ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నది. ఈ సినిమాలో అమీర్ కోసం లోకేష్ స్పెషల్ గా క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.


‘గజినీ 2’పైనా అమీర్ ఫోకస్


అటు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి ‘గజినీ 2’ గురించి అమీర్ ఖాన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ‘గజినీ’ సినిమాను ప్రాంచైజీగా మార్చాలని అమీర్ భావిస్తున్నారట. ‘గజనీ 2’ మూవీ కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేయాలని అల్లు అరవింద్ తో పాటు మంతెన మధును కోరినట్లు తెలుస్తోంది. ‘గజనీ 2’ ఫస్ట్ డ్రాఫ్ట్ కోసం అమీర్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. 



Read Also: ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!